కేయూ క్యాంపస్: ఈత కోసం కెనాల్లో దూకిన ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతయ్యాడు. కేయూ పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిన్యాతండాకు చెందిన 22ఏళ్ల భూక్య వాసు కేయూ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈఈఈ ఫైనల్ ఇయర్ చదువుతూ, యూనివర్సిటీలోని హాస్టల్లో ఉంటున్నాడు. ఆది వారం మధ్యాహ్నం 3–30 గంటలకు మరో ఇద్దరు విద్యార్థులు సందీప్, సాయితో కలిసి వాసు కళాశాల సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వకు ఈతకు వెళ్లాడు. ఒకరితర్వాత ఒకరు కాల్వలో దూకి ఈత కొట్టి పైకి వచ్చారు. వాసు ఈదుకుంటూ దరికి వచ్చి చిన్నచెట్టుకొమ్మను పట్టుకోబోయి నీటి ప్రవాహంలో మునిగిపోయాడు. వెంటనే మిగిలిన ఇద్దరు విద్యార్థులు డయల్ 100, హాస్టళ్ల జాయింట్ డైరెక్టర్ దయాకర్కు ఫోన్ చేశారు. దయాకర్ పోలీ సులతోపాటు వాసు కుంటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.రమణ, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, హాస్టళ్ల డైరెక్టర్లు సుమలత, శ్రీనివాస్, స్టూడెంట్స్ వెల్ఫేర్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి, ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు, పలువురు విద్యార్థులు కెనాల్ వద్దకు వెళ్లారు. కేయూ పోలీస్స్టేషన్ సీఐ రవికుమార్ కూడా అక్కడికి చేరుకొని ఇద్దరు విద్యార్థులతో మాట్లాడి ఏం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి పరిశీలించారు. సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చి కెనాల్లో తాడుతో కొక్కెం వేసి పరిశీలించింది. చీకటి పడడంతో ఇప్పుడు వెతకడం కష్టమని, సోమవారం ఉదయం వస్తామని వెళ్లిపోయారు. కాగా, వాసు తండ్రి కొంతకాలం కిత్రం మరణించాడు. తల్లి, సోదరుడు ఉన్నారు. ఈసంఘటన వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం దృష్టికి కూడా వెళ్లింది. కేసును నమోదు చేసి దరాప్యప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు.
గతంలో ఇద్దరు విద్యార్థుల మృతి..
కాకతీయ యూనివర్సిటీ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలలో చదవుతూ కెనాల్లో ఈతకోసం వెళ్లి గతంలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. 2016 సంవత్సరంలో ఒకరు, 2022–2023 సంవత్సరంలో ఒకరు ఈతకోసం వెళ్లి చనిపోయారు. ఇప్పుడు మరో విద్యార్థి భూక్యా వాసు ఈతకోసం కెనాల్లో దూకి గల్లంతయ్యాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు విద్యార్థులు కెనాల్కు ఈతకు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.


