విద్యుదాఘాతంతో కూలీ మృతి
సంగెం: విద్యుదాఘాతంతో రోజువారీ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన సంగెం మండలం లోహిత పెద్ద తండాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాయపర్తి మండలం సూర్య తండాకు చెందిన గుగులోత్ రాజేందర్(29) రోజువారీగా అదే తండాకు విద్యుత్ సబ్ కాంట్రాక్టర్ బానోత్ దేవేందర్ వద్ద పనిచేస్తున్నాడు. శనివారం సంగెం మండలం లోహిత పెద్దతండా వద్ద స్తంభం ఎక్కి విద్యుత్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో స్తంభంపై ఉన్న తీగ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. కాంట్రాక్టర్ నెదురుగొమ్ముల సురేశ్, సబ్కాంట్రాక్టర్ దేవేందర్, విద్యుత్ అధికారులు హుటాహుటిన ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి తల్లి నీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.
గేట్వాల్వ్ సంపులో పడి వృద్ధుడు..
సంగెం : ప్రమాదవశాత్తు గేట్వాల్వ్ సంపులో పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం వరంగల్ జిల్లా సంగెం మండలం లోహిత గ్రామంలో జరిగింది. ఎస్సై వంశీకృష్ణ కథనం ప్రకారం.. వాటర్ ట్యాంకు సమీపంలోని గేట్వాల్వ్ సంపులో వృద్ధుడి మృతదేహం ఉందని సమాచారం అందడంతో పోలీ సులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. కాగా, మృతుడు పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చెందిన మాసాని కనకమల్లు(70) అలియాస్ చిన్న కనకమల్లుగా పోలీసుల విచారణలో తేలింది. మృతుడు చెన్నారం గ్రామంలో బంధువు అంత్యక్రియలకు సైకిల్పై వెళ్లొస్తూ ప్రమావశాత్తు సంపులో పడినట్లు గుర్తించారు.
అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్..
రామన్నపేట : నగరంలోని కాశిబుగ్గ శాంతినగర్లో నివాసం ఉంటున్న ఆటోడ్రైవర్ ఎండీ అహ్మద్ ఖాన్ (38) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుకూర్ తెలిపారు. ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం.. నగరంలోని కాశిబుగ్గలో నివాసం ఉంటున్న అహ్మద్ ఖాన్ గత నెల 27న ఉదయం 8 గంటల సమయంలో తల భాగంలో రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉండడాన్ని తన ఇంట్లో అద్దెకుంటున్న రేజియా గమనించింది. వెంటనే మృతుడి తల్లి రేహానాకు సమాచారం అందించింది. దీంతో రేహానా వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న తన కుమారుడు అహ్మద్ ఖాన్ను ఎంజీఎం తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం నుంచి హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై అనుమానాస్పద స్థితిలో తన కుమారుడు మృతి చెందాడనే తల్లి రేహానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ఆదివారం తెలిపారు.
బైక్ ఢీకొని వ్యక్తి..
ఖిలావరంగల్/ వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ వైపు నుంచి లేబర్ కాలనీకి వెళ్లే 100 ఫీట్లరోడ్డుపై బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథ నం ప్రకారం.. ఆదివారం రాత్రి 100 ఫీట్ల రో డ్డుకు చెందిన సుధాకర్ (48) రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని బైక్ ఢీకొంది. ఈ ఘటనలో సుధాకర్ అక్కడికక్కడే దుర్మరణం చెందా డు. ఆగ్రహించిన స్థానికులు 100 ఫీట్ల రోడ్డు మధ్యలోని భారీ పైపులైన్లను వెంటనే తొలగించాలని ధర్నా చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో మిల్స్కాలనీ, ట్రాఫిక్ పోలీసులు వచ్చి ధర్నాను విరమింపజేసినట్లు తెలిసింది.
							విద్యుదాఘాతంతో కూలీ మృతి

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
