
గవర్నర్ దత్తత గ్రామంలో సంబురాలు
ఎస్ఎస్తాడ్వాయి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్న ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కొండపర్తిలో గ్రామస్తులు శుక్రవారం సంబురాలు చేసుకున్నారు. కొండపర్తిలో ఇప్పటికే చాలా మేరకు అభివృద్ధి పనులు చేశారు. గ్రామంలోని ఆదివాసీలను వ్యవసాయం రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అభివృద్ధి పనులతోపాటు 45 ఇళ్లు మంజూరు చేశారు. 7 వ్యవసాయ బోరుబావుల నిర్మాణంతోపాటు మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టుమిషన్లు, మిర్చి పౌడర్ తయారీ పనులు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి చెందిన మేడారం జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్ ఆధ్వర్యంలో గ్రామస్తులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క చిత్రపటాలకు శుక్రవారం క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా లచ్చుపటేల్ మాట్లాడుతూ మంత్రి సీతక్క సూచన మేరకు గవర్నర్.. కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో అభివృద్ధి చెందుతుందన్నారు. కొండపర్తి అభివృద్ధికి కృషి చేస్తున్న గవర్నర్, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇర్ప సీతారాములు, కల్తి రమేశ్, ఇర్ప రామయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
కొండపర్తిలో గవర్నర్, మంత్రి సీతక్క చిత్రపటాలకు క్షీరాభిషేకం