
ప్రజల గుండెల్లోనే పీవీ..
ఎల్కతుర్తి: అభివృద్ధి లేమి.. అప్పుల ఊబిలో కూనరిల్లుతున్న తరుణంలో అన్నీ తానై ఆర్థిక సంస్కణలు చేపట్టి దేశాన్ని ప్రగతిబాట పట్టించా రు.. నాటి ప్రధాని పీవీ నర్సింహారావు. హనుమకొండ జిల్లా భీమదేవపల్లి మండలంలోని వంగర అనే ఒక చిన్న గ్రామం నుంచి ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగిన గొప్ప మేధావి పీవీ నర్సింహారావు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో వంగర గ్రామం ఓ వెలుగు వెలిగింది. ఆ సమయంలోనే గ్రామంలో పలు అభివృద్ధి పనులు జరిగాయి. నేడు దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 104వ జయంతి.
భీమదేవరపల్లి మండలం వంగరలో 1921 జూన్ 28న పీవీ జన్మించారు. రాష్ట్ర, కేంద్ర మంత్రి పదవులతోపాటు ముఖ్యమంతి, ప్రధాన మంత్రిగా పదవులకు వన్నెతెచ్చారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో వంగరలో ముమ్మరంగా అభివృద్ధి పనులు చేపట్టారు. పోలీస్స్టేషన్ మంజూరైంది. రక్షిత తాగునీటి బావి, పీవీ మోడల్ కాలనీ, బాలికల గురుకుల పాఠశాల, 24 గంటలు పనిచేసే ఆస్పత్రి, సబ్స్టేషన్ మంజూరయ్యాయి. ఓ వైపు దేశం, మరో వైపు కాంగ్రెస్ పార్టీ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో పీపీ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని తలెత్తుకునేలా చేయడంతోపాటు భారత ఖ్యాతిని దేశ విదేశాల్లో ఇనుమడింపజేసిన ఘనత పీవీదే. కాగా, 2004 డిసెంబర్ 23న పీపీ తుదిశ్వాస విడిచారు. పీవీ మరణానంతరం అయనను సొంతపార్టీ పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. పీవీ నర్సింహారావు ఇంటిని మ్యూజియంగా మారుస్తామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. పీవీ సొంతగ్రామంలో విగ్రహం ఏర్పాటు చేయకపోవడంతో చివరకు గ్రామస్తులే చందాలు వసూలు చేసుకొని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం గమనార్హం.
కళ తప్పిన వంగర గ్రామం
నేడు పీవీ నర్సింహారావు జయంతి
వంగరలో తుదిదశకు చేరుకున్న
పీవీ విజ్ఞాన కేంద్రం పనులు
తుది దశలో పీవీ విజ్ఞాన కేంద్రం పనులు
వంగర గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రెండేళ్ల క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్ రూ.11 కోట్లు మంజూరు చేసి పనులను ప్రారంభించారు. పీవీ విజ్ఞాన వేదిక పార్కు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. పీవీ విజ్ఞాన వేదికలో ప్రవేశ ద్వారం, ఫుడ్కోర్టు, ఫొటో గ్యాలరీ, పీవీ జీవిత విశేషాలకు సంబంధించిన చిత్రాలు ఉండేలా రూపకల్పన చేశారు. దీంతోపాటు ధ్యాన మందిరం, సైన్స్ మ్యూజియం, అంపీ థియేటర్, వాటర్ ఫౌంటేషన్, చారిత్రక శిల్పాలు, పార్క్కు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రారంభించాలని గత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, అప్పటి నాయకులు పట్టించుకోకపోవడంతో పనులు నత్తనడకన కొనసాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి పొన్నం ప్రభాకర్.. పీవీ విజ్ఞాన కేంద్రం నిర్మాణం పనులను వేగవంతం చేశారు. దీంతో నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.
నెరవేరని హామీలు..
హనుమకొండ– సిద్ధిపేట రహదారిలో వంగర క్రాస్ నుంచి గ్రామంలోకి వెళ్లే దారిలో స్వాగత తోరణం, పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు నాలుగు లైన్ల రహదారి నిర్మించి, సెంట్రల్ లైటింగ్ తీర్చిదిద్ధేందుకు అప్పటి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ, నేటికీ పూర్తి కాలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి వంగరలో అభివృద్ధి పనుల వేగం పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ప్రజల గుండెల్లోనే పీవీ..