
ఆయన మరణం.. ఐదుగురికి జీవం
దేవరుప్పుల : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వృద్ధుడు.. తాను చనిపోయి ఐదుగురికి జీవం పోశాడు. బ్రెయిన్డెడ్ అయిన ఆ వృద్ధుడి అవయవాలు దానం చేశారు. దీంతో ఆ కుటుంబీకులను గ్రామస్తులు, బంధువులు అభినందించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన బొందుగుల కొండయ్య (60) ఈ నెల 20వ తేదీన జనగామ–సూర్యాపేట రహదారి సీతారాంపురం స్టేజీ సమీపంలో కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన కొండయ్యను మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు నాలుగు రోజులు చికిత్స చేసినా కొండయ్య అచేతన(బ్రెయిన్డెడ్) స్థితిలోకి వెళ్లాడు. దీంతో మృతుడి భార్య అంజమ్మ, కుమారుడు మహేశ్, కూతురు వైష్ణవి అంగీకారంతో ఆస్పత్రి వైద్యులు కొండయ్య అవయవాలు తీశారు. వీటిని శస్త్రచిక్సిత ద్వారా ఐదుగురికి అమర్చనున్నారు. కాగా, కొండయ్య మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం స్వగ్రామం కడవెండికి తీసుకురాగా కటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు.
వృద్ధుడి అవయవాలు దానం
కుటుంబీకులను అభినందించిన
బంధువులు, గ్రామస్తులు