హన్మకొండ: వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రూ.2,230.56 కోట్ల టర్నోవర్కు చేరుకుందని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో మహాజన సభ జరిగింది. పూర్వ వరంగల్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సభ్య సంఘాల చైర్మన్లు పాల్గొన్న ఈ సభకు మార్నేని రవీందర్ రావు అధ్యక్షత వహించి మాట్లాడారు. 2024–2025 ఆర్థిక సంవత్సరంలో వరంగల్ డీసీసీబీ రూ.5.10 కోట్ల లాభాలు గడిచిందన్నారు. రూ.1,634.79 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. రూ.595.77 డిపాజిట్లు సేకరించినట్లు వివరించారు. రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాలకు అందించిన ఆర్థిక సేవలు, క్వాలిటీ మేనేజిమెంట్ సిస్టమ్ను గుర్తించిన అంతర్జాతీయ ప్రామాణిక సంస్థ ఐఎస్ఓ 9001 సర్టిఫికెట్ జారీ చేసిందన్నారు. వరంగల్ డీసీసీబీ పరిధిలోని పీఏసీఎస్లు, రైతు సేవ సహకార సంఘాలను బహుళార్థక సేవా కేంద్రాలు (ఎంఎస్సీ)గా పరివర్తింపజేస్తూ ఆర్థికంగా బలపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద డీసీసీబీకి అతి తక్కువ వడ్డీ 4శాతంతో రుణాలు ఇచ్చిందని, 70 పీఏసీఎస్లకు గాను 50 సంఘాలకు 129 ఆక్టివిటీస్కు రూ.54.72 కోట్ల రుణం మంజూరు చేసిందన్నారు. ఈ రుణంతో ఆదాయం పెంచుకుని సంఘాలు ఆర్థికాభివృద్ధ్ది సాధిస్తున్నాయన్నారు. ఎంఎస్సీలో దేశంలో వరంగల్ డీసీసీబీ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నాబార్డు ఆధ్వర్యంలో పీఏసీఎస్ల ద్వారా అన్ని రకాల సేవలు అందించేందుకు ఫాక్స్ ఆక్సిలేటర్ ప్రోగ్రామ్ను ప్రవేశ పెట్టిందన్నారు. ఈ కార్యక్రమం కింద దేశంలోని మూడు రాష్ట్రాల్లో 35 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఎంపిక చేసిందన్నారు. రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్ డీసీసీబీల్లో 12 పీఏసీఎస్లను ఎంపిక చేసిందన్నారు. వరంగల్ డీసీసీబీలో నందనం, నల్లబెల్లి, మహబూబాబాద్, ధనసరి పీఏసీఎస్లను ఎంపిక చేశారని వివరించారు. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు టర్నోవర్ను రూ. 2,230. 56 నుంచి రూ.2,600 కోట్లు సాధించాలని లక్ష్యం విధించుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆయా సంఘాల చైర్మన్లు మాట్లాడుతూ పీఏసీఎస్లకు అవసరమైన ఎరువులు సరఫరా కావడం లేదని, దీనిపై స్పందించి వ్యవసాయాధికారులతో మాట్లాడి ఎరువులు సరఫరా చేయించాలన్నారు. అనంతరం ఇటీవల మృతి చెందిన చెన్నారావుపేట పీఏసీఎస్ చైర్మన్ ఎం.సత్యనారాయణ రెడ్డి, కంచపల్లి పీఏసీఎస్ చైర్మన్ రవీందర్కు నివాళులర్పించారు. సమావేశంలో సీఐఓ వజీర్ సుల్తాన్, నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ రంగారావు, డీసీఓలు సంజీవ రెడ్డి, నీరజ , వెంకటేశ్వర రావు, రాజేందర్ రెడ్డి, వాల్యానాయక్, సర్దార్ సింగ్, నాగేశ్వర రావు, టీజీ క్యాబ్ జీఎం సుజాత, డీసీసీబీ డీజీఎం అశోక్, జీఎంలు ఉషాశ్రీ, పద్మావతి, ఏజీఎంలు మధు, గొట్టం స్రవంతి, గంప స్రవంతి, రాజు, కృష్ణ మోహన్, డైరెక్టర్లు పాల్గొన్నారు.
రూ.5.10 కోట్ల లాభాలు
వరంగల్ డీసీసీబీ, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు