బోనస్‌.. నర్వస్‌ | - | Sakshi
Sakshi News home page

బోనస్‌.. నర్వస్‌

Jun 25 2025 1:25 AM | Updated on Jun 25 2025 1:25 AM

బోనస్

బోనస్‌.. నర్వస్‌

సాక్షి, మహబూబాబాద్‌: సన్నరకం ధాన్యం సాగుచేస్తే బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు పోటీపడి పంట వేశారు. అయితే కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన ధాన్యానికి బోనస్‌ ఇప్పటి వరకు రాలేదు. నెలరోజులకు పైగా కొనుగోళ్లు జరిగినా.. ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా బోనస్‌ పడలేదు. దీంతో వారు డబ్బుల కోసం కండ్లు కాయలు కాసేలే ఎదురుచూస్తున్నారు.

ఆశతో సన్నాల సాగు..

సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు అదనంగా రూ.500 బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో యాసంగిలో 1,36,236 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో అత్యధికంగా 1,12,603 ఎకరాల్లో సన్న రకాలు సాగు చేశారు. అత్యల్పంగా 23,633 ఎకరాల్లో మాత్రమే దొడ్డురకం వంగడాలు వేశారు వీటి ద్వారా మొత్తం 2,63,577 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు లెక్కించారు. ఇందులో 84,577 మెట్రిక్‌ టన్నులు రైతులు, కూలీల అవసరాల కోసం, అదే విధంగా మిల్లర్లు, ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్మకాలు చేస్తారని భావించారు. ఇవి పోగా మిగిలిన 1.79లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. 239 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 1,76,100 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.

రైతుల అరిగోస..

బోనస్‌కు ఆశపడి సన్న రకం ధాన్యం సాగుచేస్తే కొనుగోళ్లు కేంద్రాల్లో రైతులు పడని ఇబ్బందులు లేవు. ఒక కేంద్రంలో తూకంలో మోసం.. మరో కేంద్రంలో డబ్బులు ఇచ్చిన వారి ధాన్యం ముందు కాంటాలు పెట్టడం, గన్నీ సంచుల కొరత, కాంటాలు పెట్టిన ధాన్యం ఎగుమతి చేసేందుకు లారీల కొరత.. ఆపై ఉరుములు మెరుపులతో అకాల వర్షాల భయం.. టార్పాలిన్లు లేక భూమి మీద పోసిన ధాన్యం తడిసిన సంఘటనలు ఉన్నాయి. కాంటాలు పెట్టిన ధాన్యం పలుచోట్ల మొలకెత్తింది. నెలల తరబడి కేంద్రాల్లో ఉండలేక ధాన్యానికి నిప్పు పెట్టి.. తాను నిప్పు పెట్టుకుంటానని రైతులు సిద్ధమైన సంఘటనలు ఉన్నాయి. ఇన్ని ఇబ్బందులు పడి ధాన్యం అమ్మితే ఇప్పటి వరకు బోనస్‌ అందలేదు.

రూ.70కోట్లు పెండింగ్‌..

ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 239 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 35,207 మంది రైతుల నుంచి 1,76,100 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇందులో 35,970 మెట్రిక్‌ టన్నులు దొడ్డు రకం కాగా.. 1,40,130 మెట్రిక్‌ టన్నుల సన్న రకం ధాన్యం కొన్నారు. వీటికి మొత్త రూ. 4,08.48కోట్లు చెల్లించారు. సన్న రకం ధాన్యంపై ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు రూ. 500 చొప్పున 28,016 మంది రైతులకు రూ.70కోట్ల మేరకు బోనస్‌ డబ్బులు ఇప్పటి వరకు రాలేదు.

నెలలు గడిచినా జమకాని సన్నధాన్యం బోనస్‌

కండ్లు కాయలు కాసేలా

ఎదురుచూస్తున్న రైతులు

జిల్లాలో రూ.70కోట్ల మేర బకాయి

ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి

జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు వివరాలు

ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు : 239

కొనుగోలు లక్ష్యం : 1.79 లక్షల మెట్రిక్‌ టన్నులు

ధాన్యం అమ్మిన రైతులు : 35,207 మంది

కొనుగోలు చేసిన ధాన్యం : 1,76,100 మెట్రిక్‌ టన్నులు

సన్నరకం ధాన్యం : 1,40,130 మెట్రిక్‌ టన్నులు

దొడ్డురకం ధాన్యం : 35,970 మెట్రిక్‌ టన్నులు

ధాన్యం విలువ : రూ. 408.48 కోట్లు

బోనస్‌ విలువ : రూ. 70,06,50,000

బోనస్‌ రావాల్సిన రైతులు : 28,016

బోనస్‌ పడలేదు..

నాకు 4 ఎకరాల పొలం ఉంది. అందులో 85 క్వింటాళ్ల సన్నధాన్యం పండింది. నెలరోజుల క్రితం పంటను గూడూరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో అమ్మాను. బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు జిరాక్స్‌లు తీసుకున్నారు. వారంలో బోనస్‌ డబ్బులు పడతాయన్నారు. కానీ ఇంత వరకు పడలేదు. సుమారు రూ.42,500 రావాలి. ఎప్పడు పడతాయా అని ఎదురుచూస్తున్నా.

– ఓర్సు శ్రీనివాస్‌, రైతు, వడ్డెరగూడెం

బోనస్‌.. నర్వస్‌1
1/2

బోనస్‌.. నర్వస్‌

బోనస్‌.. నర్వస్‌2
2/2

బోనస్‌.. నర్వస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement