
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి
తొర్రూరు: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని వేటా (ఉమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ తెలుగు ఆసోసియేషన్) అధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని నితిన్ భవన్లో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలకు 10వేల పలకల పంపిణీని ప్రారంభించారు. పలువురు చిన్నారులకు ఝాన్సీరెడ్డితో అక్షరాభ్యాసం చేయించారు. ఫౌండేషన్ డైరెక్టర్ తక్కెళ్లపల్లి రవీంద్రతో కలిసి ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బిడ్డల అభ్యున్నతికి వందేమాతరం ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పాటుపడుతుందని, దానిలో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను ఏర్పాటు చేస్తోందన్నారు.ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలకు చేయూతనందించేందుకు ఝాన్సీరెడ్డి రూ.లక్ష విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, వీఎంఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.