
స్థానిక ఎన్నికలకు సై..
జూలైలో ఎన్నికలు ఉండొచ్చని సంకేతాలు
సాక్షి, మహబూబాబాద్: రాష్ట్రంలో ఏడాది తర్వాత మళ్లీ రాజకీయ పార్టీల్లో ఎన్నికల సందడి మొదలైంది. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు రావడంతో ఆశావహులు పోటీకి సిద్ధమని ప్రకటనలు చేస్తున్నారు. అలాగే అధికారులు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని చెబుతున్నారు.
ముందు ఆ ఎన్నికలే..
గత ఏడాదిన్నర నుంచి స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల పదవీకాలం ముగిసింది. గత ఏడాది జనవరిలో సర్పంచ్, జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ ఏడాది జనవరిలో మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగిసింది. ప్రస్తుతం వరుసగా అన్ని ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ముందుగా గ్రామ పంచాయతీలకు కాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయి.
ఆశావహుల హడావుడి..
ఏడాదికాలంగా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్న ఆశావహులు ఇటీవల మంత్రులు, ప్రజాప్రతినిధుల ప్రకటనలతో హడావుడి చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీలో కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందుకోసం అధికార కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీలోని కీలక నాయకులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం గెలుపు గుర్రాలకు టికెట్ ఇచ్చేందుకు అన్వేషణ మొదలు పెట్టారు. కొందరికి అంతా సిద్ధం చేసుకోండి అని చెప్పినట్లు తెలిసింది. ఇక బీఆర్ఎస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ వ్యతిరేకతనే బలంగా ముందుకు సాగాలని, అత్యధిక సీట్లు గెలవాలని అధినాయకత్వం చెప్పడంతో అంతా అప్రమత్తమయ్యారు. బీజేపీ కూడా తమ బల నిరూపనకు ఇదే అదునుగా భావించి గెలిచే స్థానాలు గుర్తించి బలమైన అభ్యర్థులను బరిలో దింపే పనిలో ఉన్నారు. వీరితోపాటు మొదటి నుంచి వామపక్ష పార్టీల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపి గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచే ప్యూహ రచన చేస్తున్నారు. ప్రజా సమస్యలపై గళం వినిపిస్తూ ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నారు. అయితే ఈ సారి ఏ ఎన్నికై నా.. ఏ పార్టీ నుంచేనా.. పోటీలో నిలిచేవారిలో అధికశాతం యువతే ఉండే అవకాశం ఉంది. ఈమేరకు గాడ్ఫాదర్స్ వద్దకు వెళ్లి టికెట్ ఇప్పించాలని కోరుతున్నారు.
రిజర్వేషన్లపై చర్చ..
ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందనేది అన్ని రాజకీయ పార్టీల్లో చర్చగా మారింది. బీసీ కులగణన ప్రక్రియపై ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ వస్తుందా.. ఇలా అయితే రిజర్వేషన్ 50శాతానికి మించే అవకాశం ఉంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. అసలు బీసీ రిజర్వేషన్ ఉంటుందో.. లేదో.. ఉంటే ఎంత మేరకు ఇస్తారో అనేది చర్చ. దీంతోపాటు గత ఎన్నికలకు ముందు ప్రకటించిన రిజర్వేషన్ రెండు విడతలుగా ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతుంది. అదే నిజమైతే గత ఎన్నికల్లో ఉన్న రిజర్వేషనే ఇప్పుడు కూడా అమలయ్యే అవకాశం లేకపోలేదు.
మేం సిద్ధంగా ఉన్నాం..
ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాలను తూచ తప్పకుండా అమలు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. జిల్లాలోని 18 మండలాల్లోని 193 ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేశాం. 1066 పోలింగ్ స్టేషన్లను గుర్తించాం. బ్యాలెట్ బాక్స్లు, ఆర్ఓ బుక్స్, ఇతర మెటీరియల్ సిద్ధంగా ఉంది. ఆర్ఓ, ఏఆర్ఓలకు శిక్షణ ఇచ్చాం.
–పురుషోత్తం, జెడ్పీ సీఈఓ
అన్ని రాజకీయ పార్టీల్లో సందడి
పోటీకి సిద్ధపడుతున్న ఆశావహులు
సర్వం సిద్ధం చేశామంటున్న అధికారులు
రిజర్వేషన్లపై చర్చ
పోలింగ్ స్టేషన్లు: 1,066
గ్రామ పంచాయతీలు: 482
వార్డులు : 4,110
మండలాలు: 18
జెడ్పీటీసీలు: 18
ఎంపీపీలు: 18
ఎంపీటీసీలు: 193

స్థానిక ఎన్నికలకు సై..

స్థానిక ఎన్నికలకు సై..