
విద్యుత్ సమస్యల పరిష్కారమే ధ్యేయం
మహబూబాబాద్ అర్బన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం ప్రతీ సోమవారం చేపడుతున్నామని మహబూబాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్శాఖ కార్యాలయంలో సోమవారం వినియోగదారుల నుంచి అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచారి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు విద్యుత్ ప్రజావాణిలో 512 ఫిర్యాదులు రాగా, 442 పరిష్కరించామన్నారు. విద్యుత్ బిల్లులు, మీటర్ల సమస్యలు, విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు, కేటగిరీ మార్పు, పేరు మార్పు, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు తదితర విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు వచ్చాయన్నారు. జిల్లా సర్కిల్ పరిధిలోని అన్ని ముఖ్య కార్యాలయాలు, సర్కిల్, డివిజన్, ఈఆర్వో, సబ్ డివిజన్, సెక్షన్ ఆఫీస్ల్లో విద్యుత్ ప్రజావాణి ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ సోమవారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ ప్రజావాణి నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.