
నిషేధం.. ఉత్తిమాటే!
తొర్రూరు: పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్ వస్తువులు, పాలిథిన్ కవర్ల వినియోగం పట్టణాల్లో యథేచ్ఛగా సాగుతోంది. 2022 జూలై 1నుంచి ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. అప్పటి నుంచి కఠిన ఆంక్షలు అమల్లోకి రాగా తనిఖీలు చేస్తూ చర్యలు చేపట్టారు. కొద్ది రోజుల పాటు హడావుడి చేసిన అధికార యంత్రాంగం ఆ తర్వాత అటకెక్కించారు. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ, కేసముద్రం మున్సిపాలిటీల్లో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కవర్లు, వస్తువులను నిషేధించారు. 120 మైక్రాన్ల లోపు కవర్లను, వస్తువులను తయారు చేయడం, అమ్మడం, వినియోగించుకోవడానికి వీలు లేదు. నెల రోజుల పాటు మున్సిపాలిటీల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ వ్యాపారుల దగ్గర ఉన్న ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు.
మార్పు వచ్చే సమయంలో...
జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ను నిషేధించడంతో వ్యాపారులు సైతం పాలిథిన్ కవర్లను వినియోగించడాన్ని నిలిపివేశారు. ఇంటి నుంచే సంచులు తీసుకురావాలని వ్యాపారులు సూచించడంతో ప్రజలు పాటించారు. ఆ తర్వాత వ్యాపారులు అన్ని వస్తువులు ప్లాస్టిక్ కవర్లలోనే ఇస్తుండడంతో మళ్లీ మొదటికొచ్చింది. మున్సిపాలిటీల్లో తనిఖీలు వది లేయడంతో ఎక్కడ చూసినా ప్లాస్టిక్మయమైంది. ఒకసారి వాడి పడేసే వస్తువులు విపరీతంగా వాడుతున్నారు. కూరగాయలు, పూలు, పండ్ల వ్యాపారులు పల్చని సంచులు వాడుతున్నారు. ఏ శుభకార్యం జరిగినా కల్యాణ మండపాలు, హోటళ్లు, కర్రీ పాయింట్ల నుంచి ప్యాకింగ్ సంచులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, చెంచాలు, మిఠాయి డబ్బాలు, కప్పులు వేల సంఖ్యలో బయటకు వస్తున్నాయి.
నేరుగా వ్యాపారులకు సరఫరా..
హోల్సేల్, రిటేల్ ప్లాస్టిక్ దుకాణాల్లో ఒకసారి వాడి పడేసిన వస్తువులను మున్సిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకుంటుండడంతో కొందరు కొత్త తరహాలో వ్యాపారానికి తెర లేపారు. ద్విచక్ర వాహనంపై సంచుల్లో పెట్టుకుని వ్యాపారుల దగ్గరికి వచ్చి పాలిథిన్ సంచులు సరఫరా చేస్తున్నారు. ఈ దందా ఎప్పటి నుంచో ఉండగా గత రెండు నెలలుగా పట్టణాల్లో తిరుగుతూ ప్లాస్టిక్ సంచులు విక్రయించే వారి సంఖ్య పెరిగినట్లుగా తెలుస్తోంది. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు నామమాత్రంగా కనిపిస్తున్నాయి. తనిఖీలు చేస్తున్న సమయంలో రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో చేసేదేమి లేక వెనక్కి వస్తున్నట్లుగా కార్మికులు చెబుతున్నారు.
కమిటీ, తనిఖీలు ఏమైనట్లో?
ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కవర్లు, వస్తువులను పూర్తిగా నిషేధించడంతో మున్సిపాలిటీల్లో అమలు చేసేందుకు టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిషనర్, శానిటరీ సూపర్వైజర్లు, ఎన్జీఓ, పోలీస్ కానిస్టేబుల్ కమిటీలో ఉంటారు. వీరంతా రోజూ పరిశీలించడంతో పాటు ప్రజలకు ప్రత్యామ్నాయంగా వాడుకునే వస్తువులను వివరించాల్సి ఉంటుంది. ఈ కమిటీ ఎక్కడ ఉందో కనిపించడం లేదు. శానిటేషన్ సిబ్బంది పలు దుకాణాలు తిరిగి వస్తున్నారు. సిబ్బంది పూర్తిగా పారిశుద్ధ్య నిర్వహణ పనులకే పరిమితమవ్వగా ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు పట్టించుకోవడం లేదు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ సేకరణ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి.
ప్లాస్టిక్ నియంత్రణకు సహకరించాలి
నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించినా, విక్రయించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే విక్రయదారులకు అవగాహన కల్పించాం. తనిఖీలు ముమ్మరం చేసి ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకుంటున్నాం. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించేందుకు అందరూ సహకరించాలి.
–శాంతికుమార్, మున్సిపల్ కమిషనర్, తొర్రూరు
యథేచ్ఛగా ప్లాస్టిక్ వినియోగం
నియంత్రణ చర్యలపై నిర్లక్ష్యం
మున్సిపాలిటీల్లో పర్యవేక్షణ కరువు

నిషేధం.. ఉత్తిమాటే!

నిషేధం.. ఉత్తిమాటే!