
వినతులు త్వరగా పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణి వినతులను నిర్లక్ష్యం చేయకుండా త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.వీరబ్రహ్మచారి వినతులు స్వీకరించారు. ఈసందర్బంగా లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. పెండింగ్ వినతులు కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని అధికారులు పని చేయాలన్నారు. మొత్తం 106 వినతులు వచ్చినట్లు అదికారులు వెల్లడించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, హౌసింగ్ డీఈ రాజయ్య, డీపీఓ హరిప్రసాద్, డీసీఓ వెంకటేశ్వర్లు తదతరులు పాల్గొన్నారు.
కొన్ని వినతులు పరిశీలిస్తే..
●గూడూరు మండలం ఏపూర్ గ్రామ శివారు రేకులతండాకు చెందిన మోతీరాం తన రెండున్నర ఎకరాల భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలని వినతి ఇచ్చారు.
● మానుకోటలోని కేజీబీవీలో హెడ్ కుక్గా కొంత కాలం పని చేశామని, వేతనం ఇవ్వలేదని, ప్రస్తుతం ఇప్పించాలని ఎస్కె.షహీన్, పి నాగమణి వినతిలో పేర్కొన్నారు.
● గార్ల మండలం సీతంపేట గ్రామానికి చెందిన కృష్ణ చైతన్య తనకు ఉపాధి కల్పించాలని వినతి అందజేశారు.
● మానుకోట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన శ్రవంతి తనకు కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించాలని వినతిలో పేర్కొంది.
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
ప్రజావాణిలో 106 వినతులు