
ట్రాక్టర్ బోల్తా.. అన్నదాత దుర్మరణం
● లక్ష్మారెడ్డిపల్లెలో ఘటన
గణపురం : సొంత వ్యవసాయ భూమిలో కల్టివేటర్తో దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి రైతు ఓద్దుల రాంరెడ్డి (46) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాద ఘటన సోమవారం గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లెలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు రాంరెడ్డి తన భూమిలో సొంత ట్రాక్టర్తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు రాంరెడ్డిని బయటకు తీసే ప్రయత్నం చేసిన సాధ్యపడలేదు. వెంటనే క్రేన్ సహాయంతో ట్రాక్టర్ను పక్కకు జరిపి రాంరెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య జ్యోతి, కుమారుడు, కూతురు ఉన్నారు. జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. అందరితో కలిసిమెలిసి ఉండే రాంరెడ్డి మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.
బైక్ అదుపుతప్పి ఆర్ఎంపీ మృతి
ఎల్కతుర్తి : బంధువుల వేడుకకు వెళ్లి వస్తుండగా బైక్ అదుపుతప్పి ఓ ఆర్ఎంపీ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం భీమదేవపల్లి మండలం గట్లనర్సింగాపూర్ శివారులో జరిగింది. ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ చిర్ర సుదర్శన్ (60) ఆదివారం హుస్నాబాద్లో జరిగిన బంధువుల ఫంక్షన్కు ద్విచక్ర వాహనంపై వెళ్లి అర్ధరాత్రి 1గంటకు తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడి పోయాడు. దీంతో అతడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు విజయ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
బంగారు గొలుసు లాక్కెళ్ల్లిన దుండగుడు
రాయపర్తి : వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన మండలంలోని మైలారంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. మైలారం గ్రామానికి చెందిన తుమ్మ సావిత్రమ్మ తెల్లవారుజామున 3గంటలకు ఇంటి తలుపు తెరిచి బాత్రూంకు వెళ్లింది. ఈక్రమంలో వెనకాలే వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. బాధితురాలి కుమారుడు తుమ్మ యాకూబ్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు. వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, సీసీఎస్ డీసీపీ బోనాల కిషన్, ఏసీపీ సదయ్య, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ శ్రీనివాస్లు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వివరాలను బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.

ట్రాక్టర్ బోల్తా.. అన్నదాత దుర్మరణం