
పాకిస్తానీ వలసదారుల భూములకు కోర్టు ఉత్తర్వులు
జనగామ రూరల్: దేశ విభజన అనంతరం పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లిపోయిన నేపథ్యంలో వారి ఆధీనంలో ఉన్న అప్పటి భూములకు పట్టాలు పొందిన లింగాలఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన రైతులకు నేడు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సోమవారం జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో బాధిత రైతులు తమ గోడును కలెక్టర్ ఎదుట వెళ్లబోసుకున్నా ఫలితం లేకుండా పోయింది. వివరాలిలా ఉన్నాయి.. జలాలుద్దీన్ అన్వర్ పేరుతో సీటీ సివిల్ కోర్టు సదరు భూముల్లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించద్దని స్టే తీసుకురావడంతో రైతులు ఆ వ్యక్తి ఎవరో తమకు తెలియదని, అలాంటి వ్యక్తికి కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. 1952లో మున్వర్ హైదర్ అనే వ్యక్తి పాకిస్తాన్కు వెళ్లిపోగా అప్పటి నుంచి ఆ భూములు తమ ఆధీనంలో ఉన్నాయని, 1989లోనే కస్టోడియన్ ఆఫ్ ప్రాపర్టీ కింద అప్పటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని చెప్పారు. 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పాసుపుస్తకాలు కూడా జారీ చేసిందని, ఇటీవల రైతు భరోసా రావడంలేదని, రిజిస్ట్రేషన్ కావడంలేదని వాపోయారు. జిల్లాలో లింగాలఘణపురం, రఘునాథపల్లి, జఫర్గఢ్, పాలకుర్తి, జనగామ, స్టేషన్ఘన్పూర్ మండలాల్లో వందలాది ఎకరాల భూములకు ఇలాంటి పరిస్థితి ఉంది.
లబోదిబోమంటున్న రైతులు
70ఏళ్లకు పైగా సాగులో ఉన్నామని ఆవేదన