
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
జనగామ రూరల్ : జనగామ మండలం తుకుంబాయి తండాలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు సోమవారం డీసీపీ రాజమహేంద్ర నాయక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. జనగామ పట్టణానికి చెందిన సామాను శివ, ప్యారాల సంపత్, ఒగ్గు మహేష్, మాదాసు శివ, కోమటి రాజశేఖర్ మద్యం తాగి పథకం ప్రకారం దొంగతనానికి పాల్పడ్డారని తెలిపారు. పాత నేరస్తుడైన సామాను శివతో స్నేహం చేసి, మిగతావారు కూడా శివ లాగానే దొంగతనం చేయాలని నిర్ణయించారు. ఈనెల 19వ తేదీరాత్రి దొంగతనం చేద్దామని మద్యం తాగి తిరుగుతుండగా, వెంకిర్యాల తుకుంబాయితండాకు చెందిన వాకిటి రామకృష్ణ రెడ్డి ఇంటికి తాళం వేసిఉండగా దాన్ని పగులగొట్టి, లోపలికి వెళ్లి బీరువాలో ఉన్న బంగారు వస్తువులను దొంగలించారు. బాధితుడు రామకృష్ణ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచనల మేరకు ఏఎస్పీ పండరిచేతన్ నితిన్, సీఐ దామోదర్ రెడ్డి పర్యవేక్షణలో సోమవారం ఎస్సై చెన్నకేశవులు తన సిబ్బందితో యశ్వంతపూర్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈక్రమంలో నిందితులు బైక్పై వస్తుండగా అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే సిబ్బందితో పట్టుకొని వారిని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. వారి బంగారు ఆభరణాలు, టీవీఎస్, బజాజ్ పల్సర్, లక్ష రూపాయల నగదు, మణప్పురం గోల్డ్ లోన్ రశీదు, 4తులాల గొలుసు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూసిన జనగామ సీఐ పి.దామోదర్ రెడ్డి, ఎస్సై చెన్నకేశవులు, కానిస్టేబుళ్లను వరంగల్ సీపీ అభినందించారు.
పోలీసులను అభినందించిన వరంగల్ సీపీ