
అనాథ చిన్నారులను చదివిస్తాం..
విద్యారణ్యపురి : తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులను న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) హనుమకొండ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్ పాండే, డీఎల్ఎస్ఏ వరంగల్ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్ సోమవారం హనుమకొండలోని వివేకానందనగర్లోని సాయిట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయిస్పందన హైస్కూల్లో చేర్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పోతరాజుపల్లికి చెందిన ఓని రమేశ్, అతడి భార్య తిరుపతమ్మ ఆరునెలల క్రితం మరణించారు. వీరికి కుమారులు గౌతమ్, గర్విక్ ఉన్నారు. కాగా రమేశ్ అన్న విజయ్ ప్రస్తుతం హనుమకొండలోని భవానినగర్లో ఉంటున్నాడు. తమ్ముడి పిల్లల ఆలనాపాలనకు తాము గార్డియన్గా ఉన్నామని అయితే వీరిని చదివించే స్థోమత తమకు లేదని వీరికి హాస్టల్ వసతితో పాటుగా విద్యను అందించే సదుపాయం కల్పించాలని ఇటీవల విజయ్ హనుమకొండ జిల్లా న్యాయసేవాధికారి సంస్థకు వినతి పత్రం అందజేశారు. దీంతో స్పందించిన డీఎల్ఎస్ఏ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి హనుమకొండ కార్యదర్శి క్షమాదేశ్పాండే, వరంగల్ డీఎల్ఎస్ఏ సెక్రటరీ సాయికుమార్ చైల్డ్వెల్ఫేర్ కమిటీ సహకారంతో సోమవారం ఇద్దరు చిన్నారులను వివేకానందనగర్లోని సాయిస్పందన హైస్కూల్లో చేర్పించారు. గౌతమ్ను 5వ తరగతిలో, గర్విక్ను ఒకటోతరగతిలో చేర్పించారు.
పాఠశాలలో చేర్పించిన
సీనియర్ సివిల్ జడ్జిలు