
యువత మత్తుకు దూరంగా ఉండాలి
● డీఆర్ఓ వైవీ.గణేశ్
హన్మకొండ అర్బన్: గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, వాటి బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవీ. గణేశ్ అన్నారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ జిల్లా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జూన్ 26న నిర్వహించే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ నారాయణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, నార్కొటిక్స్ డీఎస్పీ సైదులు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గోపాల్, డీఈఓ వాసంతి, కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, సామాజిక కార్యకర్త ఈవీ.శ్రీనివాసరావు, ఎఫ్ఆర్ఓ రవికృష్ణ, హోప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆచార్య, హెల్పింగ్ హ్యాండ్స్ డీఅడిక్షన్ కేంద్రం రాము, మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక అవగాహన జిల్లా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
నేడు బీసీల సత్యాగ్రహ దీక్ష
హన్మకొండ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ శనివారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద బీసీల సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తున్నట్లు బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ దీక్షలో బీసీ ప్రజలు, విద్యార్థులు, యువకులు, ప్రజా సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. బీసీ విద్యార్థులకు ప్రభుత్వం షరతులు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని, పూలే విదేశీ విద్యా జ్యోతి పథకం కింద విదేశాలకు పంపే బీసీ విద్యార్థుల సంఖ్యను 300 నుంచి 2000కు పెంచాలని, సంచార జాతుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.