
స్వల్పకాలిక సన్న రకాల సాగు మేలు
మహబూబాబాద్ రూరల్ : వానాకాలంలో ఇప్పటి వరకు సరిపడా వర్షపాతం నమోదు కాలేదని, రైతులు ఈనెల 25 తర్వాత పత్తి సాగు చేయవద్దని మల్యాల కేవీకే సమన్వయకర్త డాక్టర్ ఎస్.మాలతి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని మల్యాల కేవీకేలో శుక్రవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వానకాలం సాగు చేసే పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏర్పాటు చేసిన శిక్షణలో డాక్టర్ మాలతి మాట్లాడారు. రైతులు వరిలో స్వల్పకాలిక సన్న రకాలు వేసుకోవడం ఉత్తమమని సూచించారు. ఆరుతడి పంటలుగా పెసర, జొన్న, మొక్కజొన్న, ఇతర పంటలు సాగు చేసుకోవాలన్నారు. మిర్చి సాగు వీలైనంత మేరకు విస్తీర్ణం తగ్గించుకోవడం మంచిదని సూచించారు. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించి పచ్చిరొట్ట పంటలు, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంపొందించాలని అన్నారు. వరిలో పీ.ఎస్.బీ విరివిగా వాడాలని తెలిపారు. సరైన వర్షాలు పడకపోతే రైతులు నూనె గింజ పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. సమావేశంలో ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ తిరుపతిరెడ్డి, శాస్త్రవేత్తలు రాంబాబు, క్రాంతికుమార్, రైతులు పాల్గొన్నారు.
ఈనెల 25తర్వాత పత్తి సాగు చేయొద్దు
మల్యాల కేవీకే సమన్వయకర్త మాలతి