
కలహాల కాంగ్రెస్...
సాక్షిప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోసారి భగ్గుమన్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వ్యాఖ్యలతో బట్టబయలయ్యాయి. రాహుల్గాంధీ జన్మదినం సందర్భంగా గురువారం వరంగల్ పోచమ్మమైదాన్లో జరిగిన కార్యక్రమంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పరోక్షంగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డిపై నోరు పారేసుకోవడం పార్టీవర్గాల్లో కలకలం రేపింది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో స్తబ్ధత కనిపిస్తున్నా.. కొండా మురళి వ్యాఖ్యలతో ఒక్కసారిగా రచ్చమొదలైంది. ఈ వ్యాఖ్యలపై కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి గాని స్పందించకపోగా, వారి అనుచరులు సైతం మౌనం వహించారు. పార్టీలో తీవ్ర సంచలనంగా మారిన కొండా మురళీధర్రావు వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీనియర్ నాయకుల ద్వారా ఆరా తీసినట్లు సమాచారం.
మాజీ టీడీపీ నేతలే లక్ష్యంగా...
ఓరుగల్లు కాంగ్రెస్ నేతల మధ్య కొంతకాలంగా అంతర్గత కలహాలు సాగుతున్నాయి. ప్రధానంగా మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మధ్య గతంలోనూ పరస్పర ఆరోపణలకు సంబంధించిన ఆడియో రికార్డు సోషల్ మీడియాలో వైరలైంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కొందరు ఎమ్మెల్యేలు కొండా సురేఖకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారన్న ప్రచారం జరిగింది. ఇందులో ప్రధానంగా గతంలో టీడీపీలో పనిచేసి.. ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్న కొందరు ఎమ్మెల్యేలు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని కూడా కొండా సురేఖ దంపతులు చాలాసార్లు తమ అనుచరులతో వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో కొండా మురళీధర్రావు గురువారం పోచమ్మమైదాన్ సభలో కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం కలకలంగా మారింది. ‘కనుబొమ్మలు లేని నాయకుడు టీడీపీని భ్రష్టు పట్టించి.. చంద్రబాబును ఓడించి కేసీఆర్కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో నాటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ తిష్టవేశాడన్న’ కొండా మురళీధర్రావు... ‘75 ఏళ్ల దరిద్రుడు, ముసలోడు ఎన్నికలకు ముందు మా వద్దకు వచ్చి మా కాళ్లు పట్టుకొని ఈసారి సీటు నాకు వదిలిపెట్టమని ప్రాధేయపడితే మా మద్దతుతో పరకాల ఎమ్మెల్యే అయ్యాడు’ అని ఇద్దరిపై ఘాటైన ఆరోపణలు చేయడం రాజకీయవర్గాల్లో దుమారం రేపుతోంది.
గురువారం ఉదంతంపై అధిష్టానం ఆరా...
వరంగల్ కాంగ్రెస్లో దుమారం రేపిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో ఇటీవలి పరిణామాలపై ఓ వైపు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు ఇప్పటికే తెప్పించుకున్న ప్రభుత్వ పెద్దలు.. పార్టీ సీనియర్ల ద్వారా ‘వరంగల్లో అసలేం జరుగుతోంది’ని ఆరా తీసినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. గురువారం రాత్రి కూడా ఉమ్మడి వరంగల్కు చెందిన నలుగురు సీనియర్ నాయకులతో టీపీసీసీ పెద్దలు మాట్లాడినట్లు తెలిసింది. అలాగే, గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలతో కూడా రాష్ట్ర పార్టీ బాధ్యులు ఒకరు మాట్లాడినట్లు సమాచారం. త్వరలోనే ఉమ్మడి వరంగల్కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలను హైదరాబాద్కు పిలిచి మాట్లాడే అవకాశం ఉందని కూడా పార్టీవర్గాల ద్వారా తెలిసింది.
కొండా మురళీధర్రావు వ్యాఖ్యలతో బట్టబయలు
తారస్థాయికి చేరిన
కాంగ్రెస్ గ్రూపువార్
సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా
ఎమ్మెల్యేలు రేవూరి, కడియంపై సీరియస్ వ్యాఖ్యలు
ఓరుగల్లు కాంగ్రెస్లో మళ్లీ రాజకీయ దుమారం
తాజా పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా?

కలహాల కాంగ్రెస్...

కలహాల కాంగ్రెస్...