
‘జంపన్న’ సుందరీకరణ ..
ఎస్ఎస్తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం మహాజాతర సమయంలో కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరించే జంపన్న వాగును సుందరీకరించనన్నారు. భక్తులకు మరింత ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కు రూ. 5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిసింది. ఈ నిధులతో వాగును అభివృద్ధి చేయనున్నారు. మంత్రి సీతక్క చొరవ మేరకు జంపన్న వాగుపై రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసినట్లు సమాచారం.
జంపన్న వాగు ఒడ్డున పార్కులు, బెంచీల ఏర్పాటు..
జంపన్న వాగుపై రెండు వైపులా స్నాన ఘట్టాలు నిర్మించారు. జాతర సమయంలో భక్తులు స్నాన ఘట్టాలపై అమర్చిన బ్యాటరీ ఆఫ్ ట్యాబ్స్ ద్వారా స్నానాలు ఆచరిస్తారు. అయితే వాగుపై స్నాన ఘట్టాలు తప్ప కొత్తదనం ఏమీ కనిపించదు. ఈ నేపథ్యంలో ఈసారి మహాజాతర నాటికి స్నాన ఘట్టాల వద్ద భక్తులకు ఆహ్లాదకర వాతావరణం అందించేందకు పార్కులు, కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఒకటి రెండు కాటేజీలను కూడా నిర్మించనున్నారు. జాతర సమయంలో భక్తులు ఎండ, వర్షం నుంచి ఉపశమనం పొందేందుకు జంపన్న వాగు ఒడ్డున షెడ్లు కూడా నిర్మించే అవకాశం ఉంది. ఫలితంగా సుందరీకరణతో ఈసారి జాతరకు వచ్చే భక్తులకు జంపన్న వాగు ఆకర్షణీయంగా కనిపించనుంది.
మంత్రి సీతక్క చొరవతో..
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మేడారంలో భక్తుల సౌకర్యార్థం శాశ్వత అభివృద్ధి పనులపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా జంపన్న వాగు భక్తులకు ఆకర్షణీయంగా కనిపించాలనే సంకల్పంతో సుందరీకరణ పనులకు నిధుల మంజూరుకు కృషి చేసినట్లు తెలుస్తోంది. జంపన్నవాగులో ఫౌంటెన్ కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత మహాజాతరలోనే సమ్మక్క– సారలమ్మ చిహ్నాలుగా వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారు. అయితే ఆ ఆలోచన కార్యరూపం దాల్చ లేదు. ఈ నేపథ్యంలో ఈసారి మహాజాతర వరకు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈవిషయంపై టూరిజం కార్పొరేషన్ ఏఈ విజయకుమార్ను వివరణ అడగగా జంపన్నవాగులో రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తనకు సమాచారం తెలియదన్నారు. నేటి(శుక్రవారం) మధ్యాహ్నం కల్లా వివరాలు తెలుస్తాయన్నారు.
వాగు అభివృద్ధి పనులకు నిధులు
రూ. 5 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
ఆహ్లాదకరంగా మారనున్న స్నానఘట్టాలు