
డిస్క్ల మార్పుపై మల్లగుల్లాలు..
హన్మకొండ : అమ్మవారిపేట 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి హనుమకొండ, వరంగల్లోని రెండు సబ్ స్టేషన్లకు వేసిన విద్యుత్ లైన్లో తలెత్తిన సమస్య పరిష్కారానికి టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ, వరంగల్ సర్కిల్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. నాణ్యత లేని డిస్క్ల సమస్య అధికారులకు తలనొప్పిగా మారింది. తరచూ డిస్క్లు పగిలి షార్ట్ సర్క్యూట్ అవుతూ విద్యుత్ అంతరాయం కలుగుతుండడంతో దిద్దుబాటు ఎలా అనే ఆలోచనలో పడ్డారు. అంతరాయాలను నివారించడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని అమ్మవారిపేట 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి హనుమకొండ న్యూశాయంపేట, వరంగల్ ఉర్సు వరకు 33 కేవీ విద్యుత్ లైన్ వేశారు. ఈ లైన్లో తరచూ విద్యుత్ అంతరాయాలు కలుగుతుండడంతో స్థానిక అధికారులు సీఎండీ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోంది. దీంతో క్షేత్ర స్థాయి అధికారులు, ఉద్యోగులు అంతరాయం కలిగిన ప్రతీసారి నరకయాతన పడుతున్నారు.
సమస్య గుర్తించడంలో తీవ్ర ఇబ్బందులు
ఎక్కడ సమస్య ఉత్పన్నమైందో గుర్తించడం ఉద్యోగులకు కష్టతరంగా మారింది. టవర్ ఎక్కి పరిశీలిస్తేనే ఈ సమస్య గుర్తిస్తామని, ఇలా ప్రతీ టవర్ ఎక్కి దిగడం ద్వారా అవస్థలు పడుతున్నామని, కాంట్రాక్టర్ చేసిన నాణ్యతలేని పనికి తాము బలవుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ 33 కేవీ లైన్లో తరచూ విద్యుత్ అంతరాయం కలుగడంపై టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఏప్రిల్ జరిగిన సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎందుకు అంతరాయాలు జరుగుతున్నాయని అధికారులను అడిగితెలుసుకున్నారు. డిస్క్లు తరచూ పగిలిపోతున్నాయని, దీంతో షార్ట్ సర్క్యూట్ అయి బ్రేక్డౌన్ అవుతుందని సీఎండీకి వివరించారు. దీంతో ఈ విద్యుత్ లైన్ నిర్మించిన కాంట్రాక్టర్ ద్వారా డిస్క్లన్నీ మార్పించాలని అధికారులను ఆదేశించారు.
కాంట్రాక్టర్ నుంచి లభించని
సంపూర్ణ మద్దతు..
అయితే కాంట్రాక్టర్ నుంచి అధికారులకు సంపూర్ణ మద్దతు లభించడం లేదని విద్యుత్ ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాను విద్యుత్ లైన్ వేసినప్పుడే క్వాలిటీ కంట్రోల్ అధికారులతో పాటు ఇతర అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తనకు బిల్లులు చెల్లించారని, అప్పుడు నాణ్యత ఉన్నవి, ఇప్పుడు నాణ్యత లేకుండా ఎలా పోతాయని, పైగా తనకుండే 18 నెలల మెయింటెనెన్స్ సమయంకూడా గడిచి పోయింది... తాను ఎందుకు డిస్క్లు మారుస్తానని కాంట్రాక్టర్ ఎదురు ప్రశ్నించారని విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా, 15 నుంచి 20 ఏళ్ల క్రితం వేసిన విద్యుత్ లైన్ల డిస్క్లు, ఇన్సులేటర్లు ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా, పగలకుండా ఉండగా మూడు, నాలుగేళ్ల క్రితం వేసిన అమ్మవారిపేట–న్యూశాయంపేట, అమ్మవారిపేట– ఉర్సు 33 కేవీ విద్యుత్ లైన్లో ఎందుకు సమస్య ఉత్పన్నమవుతుందనే చర్చ సాగుతోంది. నాణ్యత లేని డిస్క్లు, ఇన్సులేటర్లు వాడడం వల్లే అవి పగిలిపోయి ఈ పరిస్థితులు కలుగుతున్నాయని ఉద్యోగులు తెలిపారు.
టీజీ ఎన్పీడీసీఎల్పై రూ.4 లక్షల వరకు భారం..
33 కేవీ విద్యుత్ లైన్ వేసిన కాంట్రాక్టర్పై అధికారులు ఒత్తిడి పెంచడంతో తాను డిస్క్లు వేయనని, అవసరమైతే లేబర్ సాయం మాత్రం చేస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే డిస్క్ల ఎవరు తీసుకురావాలి..? ఎక్కడి నుంచి తీసుకురావాలి..? అనే మీమాంసలో అధికారులు పడ్డారు. కాంట్రాక్టర్ నుంచి సహాయ నిరాకరణ ఎదురుకాగా ఈ సమస్య పరిష్కారం అధికారులకు భారం మారుతోంది. చివరకు ఎన్పీడీసీఎల్ అధికారులు డిస్క్లు వేసే బాధ్యత తీసుకుని కాంట్రాక్టర్ ద్వారా లేబర్ సాయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. డిస్క్, దానిని బిగించడానికి వాడే మెటీరియల్ కలుపుకుని ఒక్కో డిస్క్కు రూ.615 ఖర్చవుతుంది. ఈ లెక్కన 33 కేవీ విద్యుత్ లైన్లో దాదాపు 600కు పైగా డిస్క్లు మార్చాల్సిన అవసరముంది. 600 డిస్క్లు మార్చడానికి వాటి ఖరీదు రూ.3.69 లక్షలు అవుతుంది. ఇతర ఖర్చులు కలుపుకుంటే దాదాపు రూ.4 లక్షల వరకు టీజీ ఎన్పీడీసీఎల్పై భారం పడనుంది. ఈ భారం భరించడంపై అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలిసింది. కాంట్రాక్టర్తో చేయించాలా... డిపార్ట్మెంట్ ద్వారా చేయాలా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.
డిపార్ట్మెంట్ ఖర్చుతో చేయాలా? కాంట్రాక్టర్తో చేయించాలా?
అమ్మవారిపేట 220 కేవీ సబ్స్టేషన్ నుంచి 33 కేవీ విద్యుత్ సబ్
సబ్ స్టేషన్లకు లైన్..
నాణ్యతలేని డిస్క్లతో తరచూ విద్యుత్ అంతరాయం
కాంట్రాక్టర్తో మార్పించాలని
సీఎండీ వరుణ్రెడ్డి ఆదేశం
తానేందుకు మార్చుతానంటున్న
కాంట్రాక్టర్
అయోమయస్థితిలో అధికారులు