
ఏసీబీ వలలో విద్యుత్శాఖ ఎస్ఈ నరేశ్
మహబూబాబాద్ రూరల్ : విద్యుత్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పరిమితి పెంపునకు కాంట్రాక్టర్లనుంచి లంచం తీసుకుంటూ ఆ శాఖ మహబూబాబాద్ ఎస్ఈ నరేశ్ బుధవారం ఏసీబీకి చిక్కారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన క్లాస్–1 కాంట్రాక్టర్లు అజారుద్దీన్, నజీరుద్దీన్ మహబూబాబాద్ జిల్లాలోని కురవి, మరిపెడ సబ్ డివిజన్ల పరిధిలోగల సీరోలు, చిన్నగూడూరు సెక్షన్లలో విద్యుత్ పనుల కోసం టెండర్లు దాఖలు చేశారు. పనుల నిర్వహణకు రూ.20 లక్షల పరిమితి మాత్రమే ఉండగా, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ రూ.40 లక్షలకు పెంచేందుకు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) జే.నరేశ్ను సంప్రదించారు. రెండు నెలలుగా తిరుగుతున్నప్పటికీ పనికాలేదు. ఈ క్రమంలో సదరు అధికారి నరేశ్ లక్ష రూపాయల లంచం డిమాండ్ చేయగా, ఆ ఇద్దరు కాంట్రాక్టర్లు ఈ నెల 14వ తేదీ (శనివారం) రూ.20వేలు ముట్టజెప్పారు. మిగతా రూ.80వేలు ఇచ్చి ఆ అధికారితో పని చేయించుకోవడం ఇష్టంలేక వారు ఏసీబీ అధికారులను సంప్రదించారు. పక్కా ప్లాన్ ప్రకారం బుధవారం ఉదయం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ సమీపంలో ఎస్ఈ నరేశ్ అద్దెకు ఉండే ఇంటి వద్ద కాంట్రాక్టర్లు అజారుద్దీన్, నజీరుద్దీన్లు ఆయనకు రూ.80వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నరేశ్ను అదుపులోకి తీసుకుని గురువారం ఉదయం వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సాంబయ్య తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు ఎల్.రాజు, ఎస్.రాజు, ఎస్సైలు పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది ఎవరైనా సరే ప్రజల పనుల కోసం లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా 9154388912 నంబర్ను సంప్రదించాలని వరంగల్ ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్య కోరారు.
కాంట్రాక్టు అగ్రిమెంట్ పరిమితి
పెంచేందుకు రూ.లక్ష డిమాండ్
రూ.80వేలు తీసుకుంటుండగా
పట్టుకున్న ఏసీబీ అధికారులు

ఏసీబీ వలలో విద్యుత్శాఖ ఎస్ఈ నరేశ్