
22న భద్రకాళికి బంగారు బోనం
హన్మకొండ కల్చరల్: నగరంలోని భద్రకాళి అమ్మవారికి ఈనెల 22న బంగారు బోనం సమర్పించనున్నట్లు భద్రకాళి ఆలయ ఈఓ శేషుభారతి తెలిపారు. భద్రకాళి ఆలయంలో బోనాలు నిర్వహించాలని దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా బుధవారం ఆలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈఓ శేషుభారతి, అర్చకుడు భద్రకాళి శేషు ప్రచార బ్యానర్ను ఆవిష్కరించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారని, అలాగే లాల్దర్వాజ కమిటీ సభ్యులు, భక్తులు భారీగా హాజరై అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని తెలిపారు. జంతు బలులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. భద్రకాళి ఆలయ చరిత్రలో కొత్తగా బోనాలు ఏమిటని విలేకరులు ప్రశ్నించగా.. ఆచార సంప్రదాయాల ప్రకారమే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటి నుంచి ప్రతీ సంవత్సరం బోనాలు నిర్వహించనున్నట్లు అర్చకుడు భద్రకాళి శేషు తెలిపారు. అనంతరం ధర్మకర్తల మండలి సభ్యులను పరిచయం చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బోనాలు ..
ఉమ్మడి జిల్లాలో ఆషాఢం, శ్రావణమాసాల్లో బీరన్న, పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ తదితర గ్రామదేవతలకు మాత్రమే బోనాలు సమర్పించే ఆనవాయితీ ఉంది. గ్రామదేవతలకు కల్లుశాక, జంతుబలులు ఇచ్చే సంప్రదాయం ఉంది. శైవ, వైష్ణవ, స్మార్త పద్ధతిలో దేవాలయాల్లో జరిగే వాటికి శాస్త్రాధారం ఉంటుంది. ఈ మేరకు వైదిక ఆగమానుసారం జరుగుతున్న దేవాలయంలో బోనాలు సమర్పించడం పట్ల పలువురు భక్తులు విమర్శలు చేస్తున్నారు. దీనిపై అర్చకులను వివరణ కోరగా దేవాదాయశాఖ ఆదేశంతో వైదిక సంప్రదాయం ప్రకారమే జరిగే బోనాలు నిర్వహిస్తామని తెలిపారు.
దేవాదాయ, ధర్మాదాయశాఖ
కమిషనర్ ఆదేశాలతో ఆలయ
చరిత్రలో ఈసారి వేడుకలకు ఏర్పాట్లు
వివరాలు వెల్లడించిన ఈఓ శేషుభారతి