
కంచ కట్టయ్య జీవితం ఆదర్శం
నర్సంపేట: మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం నింపిన కంచ కట్టయ్య (సైన్స్ మనిషి..బిరుదు) జీవితం ఆదర్శమని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన ప్రొఫెసర్ కంచ ఐలయ్య సోదరుడు, సైన్స్ శాస్త్రవేత్త కంచ కట్టయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కంచ కట్టయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రొఫెసర్ కంచ ఐలయ్యతో పాటు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు మూఢనమ్మకాలు వీడి కంచ కట్టయ్య జీవితాన్ని ఆదర్శం తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ ఓబీసీ వర్కింగ్ చైర్మన్ వీరన్నయాదవ్, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులు సుభాశ్, కంపాటి వీరయ్య, ఓయూ జేఏసీ నాయకులు కొంగళపాండుకురుమ, కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వన్నడి రమేశ్, వెంకట్నాయక్, మేకల శివ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో నియోజకవర్గ అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక, రైతు భరోసా వంటి పథకాల అమలుపై మంత్రి ప్రభాకర్ చర్చించారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్