
నిర్లక్ష్యపు డ్రైవింగ్కు బాలకార్మికుడు బలి..
బయ్యారం: నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ బాలకార్మికుడిని బలి తీసుకుంది. బాలుడిని పనిలో పెట్టుకోవడమే నేరం కాగా అలసిపోయి నిద్రిస్తున్న ఆ చిన్నారిపై నుంచి బోరువాహనం వెళ్లడంతో నిద్రలోనే అనంతలోకాలకు వెళ్లాడు. ఈ హృదయవిధారకర ఘటన మంగళవారం మండలంలోని మిర్యాలపెంట సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామానికి చెందిన ధారావత్ భాస్కర్ బోరువాహనంపై పని చేసేందుకు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా నీలవరం గ్రామానికి చెందిన కబాతి హిడ్మా(14) పదిరోజుల క్రితం మేనమామ సుక్కతో కలిసి వచ్చాడు. ఈ క్రమంలో బయ్యారం మండలంలోని మిర్యాలపెంట సమీపంలో బోరువేస్తుండగా హిడ్మా ఆ వాహనం కింద నిద్రపోయాడు. ఇది గమనించకుండా వాహన డ్రైవర్ భూక్య భాస్కర్ వెనకకు తిప్పడంతో హిడ్మా తలపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి మేనమామ సుక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.
నిద్రిస్తున్న బాలుడిపై నుంచి వెళ్లిన బోరువాహనం
అక్కడికక్కడే మృతి.. మిర్యాలపెంట సమీపంలో ఘటన