
అనుమతి లేని జలపాతాలకు వెళ్లొద్దు..
వాజేడు: పర్యాటకులు అనుమతి లేని జలపాతాలకు వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వాజేడు మండలంలోని బొగత జలపాతానికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఇక్కడ పర్యాటకులకు రక్షణ చర్యలతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించారు. అయితే వాజేడు మండలంలో మరికొన్ని జలపాతాలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఈ జలపాతాలు దూరంగా ఉండడంతో ఇక్కడికి పర్యాటకుల సందర్శనను నిషేధించారు. అయినా కొందరు పర్యాటకులు దొంగచాటున వెళ్తున్నారు. ఆ సమయంలో ప్రమాదాలకు గురై ప్రాణా లు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ సిబ్బంది అవగాహన కల్పించడంతో పాటు సుదూర ప్రాంతాల్లో ఉన్న అనుమతి లేని జలపాతాలకు వెళ్లొద్దని హెచ్చరిక బోర్డులు (ఫ్లెక్సీలు) ఏర్పాటు చేశారు. దీంతోపాటు అటుగా వెళ్లే రహదారులకు అడ్డుగా కర్రలతో బారికేడ్లు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమిస్తున్నారు. వాజేడు మండల పరిధి కృష్ణాపురం సమీపంలోని అడవిలో భామన సిరి, దూలాపురం సమీప గుట్టల్లో మాసన్లొద్ది, కొంగాల సమీప గుట్టల్లో దూసపాటి లొద్ది, అరుణాచలపురం సమీప గుట్టల్లో గుండం, మొరుమూరు గుట్టల్లో మరో జలపాతం ఉన్నాయి. వీటి వద్దకు పర్యాటకులు వెళ్లొద్దని వాజేడు రేంజర్ చంద్రమౌళి, దూలాపురం రేంజర్ బాలకృష్ణ తెలిపారు. ఆయా జలపాతాలకు వెళ్లడంపై ఇప్పటికే నిషేధించినట్లు ప్లెక్సీలు ఏర్పాటు చేశామని, ఎవరు అతిక్రమించొద్దని వారు కోరారు.
పర్యాటకులకు అటవీశాఖ
అధికారుల విజ్ఞప్తి
ఆయా జలపాతాలపై నిషేధం
విధించినట్లు ఫ్లెక్సీల ఏర్పాటు