వివాహితను ఇంటినుంచి వెళ్లగొట్టిన కుటుంబీకులు.. | - | Sakshi
Sakshi News home page

వివాహితను ఇంటినుంచి వెళ్లగొట్టిన కుటుంబీకులు..

Jun 16 2025 6:58 AM | Updated on Jun 16 2025 6:58 AM

 వివాహితను ఇంటినుంచి వెళ్లగొట్టిన కుటుంబీకులు..

వివాహితను ఇంటినుంచి వెళ్లగొట్టిన కుటుంబీకులు..

బచ్చన్నపేట: వారు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరుకావడంతో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా అన్యోన్యంగా ఉంటున్న ఆ దంపతుల మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయి. ఇదే అదునుగా భావించిన కుటుంబీకులు ఆ వివాహితను కులం, వరకట్నం పేరుతో ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన మండలంలోని తమ్మడపల్లిలో జరిగింది. బాధితురాలు శ్రావణి అలియాస్‌ నైనిక కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బేజాడి మంజుల, మల్లేశం దంపతుల కుమారుడు కరుణాకర్‌, అదే గ్రామానికి చెందిన పోగుల విజయలక్ష్మి, నర్సింహులు దంపతుల కూతురు శ్రావణి నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరుకావడంతో పెద్దలను ఎదురించి ఎనిమిది నెలల క్రితం యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు. అనంతరం మండలంలోని కొడవటూరులోని సిద్ధేశ్వరాలయ వద్ద మ్యారేజీ సర్టిఫికెట్‌ తీసుకున్నారు. ఈ క్రమంలో ఆరు నెలలుగా అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విషయమై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి గ్రామ పెద్దమనుషుల సమక్షంలో కూడా మాట్లాడుకున్నారు. ఇంతలోనే మరోసారి కులం, వరకట్నం పేరుతో విడిపోదామని ఒత్తిడి తేవడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రావణిని కుటుంబ సభ్యులు ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారు. దీంతో తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు భర్త కావాలంటూ రోదించింది. కాగా, భర్త కరుణాకర్‌, కుటుంబ సభ్యులు మాత్రం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు.

న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట భార్య బైఠాయింపు

తమ్మడపల్లి గ్రామంలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement