
ఎలుకలు ఎంత పని చేసే..
చిల్పూరు: ఎలుకలు ఎంత పని చేశాయి.. పల్లెంలో ఉన్న దీపం, పండ్లను ఇంటి చూరులోకి తీసుకెళ్లాయి. దీంతో దీపం అంటుకుని ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ. లక్ష వరకు ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదం ఆదివారం ఉదయం మండలంలోని కృష్ణాజీగూడెంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి... గ్రామానికి చెందిన సాదం చంద్రమ్మ పెంకుటింట్లో నివాసం ఉంటోంది. రోజు మాదిరి గానే ఉదయం దేవుడికి దీపం పెట్టి బయటకు వెళ్లింది. ఈ క్రమంలో దీపం పళ్లెంలో పండ్లు ఉండడంతో ఎలుకలు వాటిని తీసుకుని ఇంటి చూరులోకి వెళ్లాయి. పంట్లతో పాటు వెలిగించిన దీపం కూడా ఉండడంతో పెంకులు అమర్చిన వెదురు కర్రలకు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు లేచాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న రూ. 26 వేల నగదు, బియ్యం, ఇతర వస్తువులు కాలి బూడిద కావడంతో సుమారు రూ. లక్ష ఆస్తి నష్టం జరిగిందని బాధితురాలు లబోదిబోమంది. నిరుపేద చంద్రమ్మను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
పల్లెంలో ఉన్న దీపం, పండ్లను
ఇంటి చూరులోకి తీసుకెళ్లిన మూషికాలు
దీపం అంటుకుని దగ్ధమైన ఇల్లు
రూ. లక్ష వరకు ఆస్తి నష్టం