
ఆకేరువాగులో పడి వివాహిత మృతి
చిన్నగూడూరు: ఆకేరువాగులో పడి ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన సోమవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన రచ్చ పద్మ(48) భర్తతో కలిసి ఉపాధి నిమిత్తం కొన్నేళ్లుగా హైదరాబాద్లో నివాసముంటున్నారు. తన తల్లి గ్రామమైన చిన్నగూడూరుకు రెండు రోజుల క్రితం భర్తతో కలిసి వచ్చింది. సోమవారం ఉదయం పద్మ ఆకేరువాగులో పడి మృతి చెందింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఎస్సై సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పద్మ మానసిక స్థితి కొద్ది రోజులుగా బాగోలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. మృతురాలికి కుమారుడు, కూతురు, భర్త ఉన్నారు.