
పద్మశ్రీ సమ్మయ్యకు గవర్నర్ సన్మానం
దేవరుప్పుల: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం రాజ్ భవన్లో నిర్వహించిన సాంస్కృతిక సమ్మేళనం కార్యక్రమంలో జనగామ జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్యను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిశోర్ సన్మానించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ చిందు యక్షగాన కళల వైభవం కోసం పాటుపడినందుకు సన్మానం లభించిందన్నారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, గంటా చక్రపాణి, డైరెక్టర్ తరుణ్, ఐఐసీటీ డైరెక్టర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
చెస్లో దేవాన్ష్కు అంతర్జాతీయ రేటింగ్
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్కు చెందిన బైరి దేవాన్ష్రెడ్డి చదరంగంలో అంతర్జాతీయ రేటింగ్ సాధించినట్లు జిల్లా చదరంగ సమాఖ్య ప్రతినిధి పి. కన్నా తెలిపారు. హనుమకొండ రాంనగర్లోని చిల్డ్రన్స్ మాంటిస్సోరి స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న దేవాన్ష్రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి 30వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో జరిగిన అంతర్జాతీయ క్లాసికల్ విభాగంలో 1508 రేటింగ్ సాధించడం హర్షణీయమన్నారు. దేవాన్ష్రెడ్డి ఆరుగురు అంతర్జాతీయ రేటెడ్ క్రీడాకారులతో తలపడి విజయం సాధించారన్నారు. ఈ రేటింగ్ సాధించడంపై తల్లిదండ్రులు రఘువీరారెడ్డి, దివ్య సంతోషం వ్యక్తం చేశారు.
4, 5 తేదీల్లో క్రికెట్ ఉమ్మడి జిల్లా జట్టు ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండ, వరంగల్, జనగా మ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జి ల్లాల అండర్–19 జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 4, 5వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు వరంగల్ క్రికెట్ అసో సియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ సోమవారం తెలిపారు. కరుణాపురంలోని వంగపల్లి క్రికెట్ క్రీడా మైదానంలో నిర్వహించే ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో కూడిన ఆరు జట్లు, ఉమ్మడి జిల్లా వేదికగా జూన్ రెండో వారం నుంచి నిర్వహించే వన్డే లీగ్ టోర్నమెంట్లో పాల్గొంటాయని తెలి పారు. ఇందులో రాణించిన క్రీడాకారులు ఉమ్మడి వరంగల్ అండర్–19 జిల్లా జట్టుకు ప్రాతినిథ్య వహిస్తారని తెలిపారు. పోటీల్లో పాల్గొనేందుకు సెప్టెంబర్ 01, 2006 నుంచి జన్మించిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు మీసేవ ద్వారా జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, సొంత క్రికెట్ కిట్తో హాజరుకావాలని తెలిపారు.
7న జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–17 బాలబాలికల బాక్సింగ్ ఎంపిక పోటీలు ఈ నెల 7వ తేదీన నిర్వహిస్తున్నట్లు బాక్సింగ్ అ సోసియేషన్ జిల్లా నిర్వహణ కార్యదర్శి పి. రాజేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు జనవరి 01, 2009 నుంచి డిసెంబర్ 31, 2010 మధ్య జన్మించి ఉండాలన్నా రు. ఆసక్తి, అర్హత గల క్రీడాకారులు 7వ తేదీ ఉద యం హనుమకొండలోని డీఎస్ఏ బాక్సింగ్ హాల్కు ఆధార్ కార్డు, స్కూల్ బోనోఫైడ్, మున్సిపల్ బర్త్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో పాటు రూ.300 ఫీజుతో హాజరుకావాలన్నారు. ఉదయం 9గంటలకు వె యింగ్ అనంతరం ఎంపిక పోటీలు ఉంటాయ న్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 10, 11వ తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

పద్మశ్రీ సమ్మయ్యకు గవర్నర్ సన్మానం