పుష్కరం.. పరిసమాప్తం | - | Sakshi
Sakshi News home page

పుష్కరం.. పరిసమాప్తం

May 27 2025 1:05 AM | Updated on May 27 2025 1:05 AM

పుష్క

పుష్కరం.. పరిసమాప్తం

భూపాపల్లి/కాళేశ్వరం: పన్నెండు రోజులు అత్యంత వైభవంగా జరిగిన సరస్వతీనది పుష్కరాలు పరిసమాప్తమయ్యాయి. ఈనెల 15న ఉదయం 5.44 గంటలకు మెదక్‌ జిల్లా రంగంపేటకు చెందిన పీఠాధిపతి మాధవానంద సరస్వతిస్వామి పుష్కరాలను ఘనంగా ఆరంభించారు. దీంతో 12 రోజులుగా భక్తజనం లక్షలాదిగా తరలివచ్చి పుష్కరిణిలో స్నానాలు ఆచరించి శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు భక్తులు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు. ముందు గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీనదిలో పుష్కర స్నానాలు చేశారు. పిండ ప్రదాన పూజలు, తర్పణాలు, సంకల్ప పూజలు చేశారు. నదీమాతకు పూజలు నిర్వహించారు. చీర, సారె, నైవేద్యం సమర్పించారు. సరస్వతి ఘాట్‌ వద్ద 17 అడుగుల ఏకశిలా సరస్వతిమాత విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి బారులుదీరారు.

చివరి రోజు లక్షకుపైగా..

ఉదయం నుంచి రాత్రి వరకు చివరి రోజు వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ, ప్రైవేట్‌ వాహనాల్లో భక్తులు భారీగా తరలి రావడంతో రద్దీ నెలకొంది. ఉదయం నుంచి పార్కింగ్‌ స్థలాల్లో వాహనాలు నిలిపారు. అనంతరం ఆటోలు, అధికారులు ఏర్పాటు చేసిన షటిల్‌ బస్సుల్లో పుష్కరఘాట్లకు తరలివెళ్లారు. రాత్రి వరకు లక్షకుపైగా మంది భక్తులు పుష్కర స్నానాలు చేసి ముక్తీశ్వరస్వామి ఆలయంలో దర్శనాలు చేసుకున్నట్లు అధికారుల అంచనా.

ప్రముఖుల పూజలు..

కాళేశ్వరంలోని సరస్వతీనదిలో ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్‌, సీఎస్‌ రామకృష్ణరావు, స్పెషల్‌ సెక్రటరీ వికాస్‌రాజ్‌ దంపతులు, ప్రవచన కర్త నాగఫణి శర్మ, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్‌నాయక్‌ పుష్కర స్నానాలు ఆచరించి విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు.

కలెక్టర్‌, ఎస్పీ పరిశీలన..

గోదావరి ఘాట్‌, పార్కింగ్‌ స్థలాలు, ఆలయ పరిసరాల్లో కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే పరిశీలించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. అధికారులు, సిబ్బందికి సలహాలు, సూచనలు అందజేశారు.

ముగిసిన హోమాలు..

కాళేశ్వరం : రాష్ట్ర ప్రజల సంపద, ఆరోగ్య వృద్ధి, పాడిపంటల శుభఫలితాల కోసం 12 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన హోమాలు సోమవారం పూర్ణాహుతితో ముగిశాయి. శ్రీ కాళేశ్వరముక్తీశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆర్థిక, శారీరక శ్రేయస్సు, వ్యవసాయోత్పత్తి అభివృద్ధికి శుభపరిణామాలు కలగాలనే ఆకాంక్షతో పుష్కరాల సమయంలో 12 రోజుల పాటు 12 హోమాలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్‌ వెంకట్‌రావు, ఈఓ మహేశ్‌, ఉత్సవ కమిటీ సభ్యులు మోహన్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన సరస్వతీనది పుష్కరాలు

15 నుంచి 26వ తేదీ వరకు నిర్వహణ

త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు,

ముక్తీశ్వరస్వామి ఆలయంలో దర్శనాలు

చివరి రోజు లక్షకుపైగా భక్తుల రాక

ప్రముఖుల పూజలు

పుష్కరం.. పరిసమాప్తం 1
1/5

పుష్కరం.. పరిసమాప్తం

పుష్కరం.. పరిసమాప్తం 2
2/5

పుష్కరం.. పరిసమాప్తం

పుష్కరం.. పరిసమాప్తం 3
3/5

పుష్కరం.. పరిసమాప్తం

పుష్కరం.. పరిసమాప్తం 4
4/5

పుష్కరం.. పరిసమాప్తం

పుష్కరం.. పరిసమాప్తం 5
5/5

పుష్కరం.. పరిసమాప్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement