
పుష్కరాలను చాలెంజ్గా తీసుకున్నాం
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరిగిన సరస్వతీనది పుష్కరాలను చాలెంజ్గా తీసుకున్నామని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. సోమవారం సాయంత్రం సరస్వతి ఘాట్ వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తమకు భగవంతుడు పుష్కరాలు నిర్వహించే అవకాశం కల్పించాడని, రూ. 40 కోట్లతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పుష్కరాలకు ప్రాతినిథ్యం వహించడం సంతోషంగా ఉందన్నారు. 15 నుంచి 26వ తేదీ వరకు జరిగిన పుష్కరాలకు ఈ ప్రాంత ప్రజలు ఆశీస్సులు అందించారని అభినందించారు. కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం తక్కువ సమయంలో ముఖ్యమంత్రి ఆలోచన మేరకు చేసిన పుష్కరాలు దిగ్విజయం అయ్యాయని తెలిపారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి సంగమంలో మొదటిసారి పుష్కరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. సరస్వతి మాతా 17 అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 30 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని, ఈ ప్రాంతానికి అన్ని లక్షల మంది ఎన్నడూ రాలేదని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మంచినీరు, అన్నదానం చేశారని అభినందించారు. మీడియా ద్వారా లక్షలాది మంది భక్తులు వచ్చేలా ప్రచారం చేశారని, టీవీ ఛానళ్లు ద్వారా వీక్షించే అవకాశం కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు. శాఖల సమన్వయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పుణ్య స్నానాలు సంవత్సరం పాటు చేసేందుకు అవకాశం ఉందని, రాలేని భక్తులు సంవత్సర కాలంలో ఎపుడైనా పుష్కర స్నానాలు చేయొచ్చని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ చాలా తక్కువ సమయంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ప్రత్యేక చొరవతో ముందస్తు ప్రణాళిక ద్వారా అధికారులకు సూచనలు చేస్తూ సరస్వతీనది పుష్కరాలు విజయవంతానికి కృషి చేశారని అభినందించారు. రానున్న గోదావరి పుష్కరాలకు శాశ్వత సదుపాయాలు కల్పిస్తామని, పుష్కరాల ముగింపు సందర్భంగా చిరుజల్లులు కురవడంతో ఆ దేవతల అనుగ్రహం అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్ మాట్లాడుతూ శ్రీ కాళేశ్వరముక్తేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం చిన్న గ్రామమని, ఈ గ్రామంలో సరస్వతీనది పుష్కరాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. 5 నెలల ముందు నుంచి ప్రణాళికలు సిద్ధం చేశామని అందుకు అనుగుణంగా ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈనిధులతో భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరాల నిర్వహణకు సహకరించిన స్థానికులు, అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పద్మశ్రీ నాగఫణి శర్మ, ఆర్అండ్బీ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మదన్ మోహన్, మక్కన్ సింగ్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాశ్ రెడ్డి, కలెక్టర్ రాహుల్ శర్మ, దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్ రావు, ఎస్పీ కిరణ్ ఖరే తదితరులు పాల్గొన్నారు.
30 లక్షల మంది భక్తుల పుణ్యస్నానాలు
ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
దుద్దిళ్ల శ్రీధర్బాబు

పుష్కరాలను చాలెంజ్గా తీసుకున్నాం