
పీహెచ్డీ పట్టాలకు ఫీజు..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో 2022 ఆగస్టు 25న స్నాతకోత్సవం నిర్వహించారు. అప్పట్లో ఆర్ట్స్, సోషల్సైన్స్, సైన్స్, కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఫార్మసీ, ‘లా’ , ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్ విభాగాల్లో పీహెచ్డీలు పొందిన అభ్యర్థులు 2022 ఆగస్టు మూడోవారం వరకు పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. రూ. వెయ్యి చొప్పున ఫీజు చెల్లించారు. అయితే అప్పటి రాష్ట్ర గవర్నర్ తమిళసైసౌందరరాజన్ స్నాతకోత్సవంలో పాల్గొనే సమయం తక్కువ ఉంటుందని, అందుకే 2019 డిసెంబర్ 31వరకు ఆయా విభాగాల్లో పీహెచ్డీలు పొందిన 56మంది అభ్యర్థులకే పట్టాలు ప్రదానం చేయించారు.దీంతో స్నాతకోత్సవం 2022 ఆగస్టు 25నాటికి వారం రోజులముందు వరకు 2020 జనవరి1నుంచి పీహెచ్డీలు పొందిన అభ్యర్థుల్లో చాలామంది రూ. వెయ్యి చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తులు చేసినవారికి ప్రదానం చేయలేదు.వారిలో ఎక్కువమంది కేయూ 23వ స్నాతకోత్సవం కోసం నిరీక్షిస్తున్నారు. ఎట్టకేలకు 2 సంవత్సరాల 9 నెలల తర్వాత మళ్లీ కేయూ 23వ స్నాతకోత్సవం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.ఈమేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కేయూ వీసీ కె ప్రతాప్రెడ్డి ఇటీవల కలిశారు. జూలై7న ముహూర్తం ఖరారు చేశారు. రాష్ట్ర గవర్నర్ కూడా స్నాతకోత్సవం వచ్చే అవకాశాలున్నాయి.
పీహెచ్డీ పట్టాలు పొందేందుకు
రిజిస్ట్రేషన్కు అవకాశం
గతంలో పట్టాలు పొందని అభ్యర్థుల గురించి పట్టించుకోకుండానే ఇటీవల 2020 జనవరి 1నుంచి 2025 మే 31వరకు ఆయా విభాగాలల్లో పీహెచ్డీలు పొందిన అభ్యర్థులు కేయూ 23వ స్నాతకోత్సవంలో పట్టాలు పొందేందుకు రూ. వెయ్యి చొప్పున చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటన విడుదల చేశారు. దీంతో గత 22వ స్నాతకోత్సవం సందర్భంగా రూ. వెయ్యి చొప్పన ఫీజు చెల్లించామని, అప్పటి స్నాతకోత్సవంలో తమకు పట్టాలు ప్రదానం చేయలేదని పలువురు సోమవారం పరీక్షల విభాగం అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మళ్లీ రూ. వెయ్యి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ వారికి తెలిపారు.
అలా ఎంతమంది ఉన్నారనే అంశంపై లెక్కలు
కేయూ 22వ స్నాతకోత్సవం సందర్భంగా ఆయా విభాగాలకు సంబంధించి ఫీజు చెల్లించి డాక్టరేట్ పట్టాలు పొందని అభ్యర్థులు ఎంతమంది ఉన్నారనే అంశంపై ప్రస్తుం లెక్కలు తీస్తున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాల 9నెలలు గడిచిపోయాయాయి. అందులోకొంతమంది ఆ తర్వాత అవసరం నిమిత్తం పట్టాలు తీసుకెళి ఉంటారా లేదా అని చూస్తున్నారు. ఎక్కువశాతం మంది మాత్రం స్నాతకోత్సవంలోనే పట్టాలు పొందేందుకు అలాగే ఉన్నారని సమాచారం. అందుకు సంబంధించిన జాబితా రూపొందించి ఆయా అభ్యర్థులకు కూడా ఈ జూలై 7న జరిగే స్నాతకోత్సవంలో పట్టాలు ప్రదానం చేస్తామని కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ చెప్పారు. కాగా, 2020 జనవరి 1నుంచి 2025 మేలో ఇప్పటివరకు అవార్డు అయిన అభ్యర్థులు 573మంది ఉన్నారు.
గత స్నాతకోత్సవానికి రూ. వెయ్యి చెల్లించిన అభ్యర్థులు
ఇందులో 56 మందికే
‘డాక్టరేట్’ ప్రదానం
మిగతా వారికి ఈ స్నాతకోత్సవంలో అందజేయనున్న అధికారులు
జూలై 7న కేయూ 23వ స్నాతకోత్సవం