
పునఃప్రారంభమయ్యేనా?
మహబూబాబాద్ అర్బన్: పేద విద్యార్థులకు వసతి కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఎస్సీ హాస్టళ్లు మూతపడ్డాయి. గతంలో విద్యార్థులు లేరనే సాకుతో బంద్ చేశారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ ఆనంద నిలయం హాస్టల్, బాలికల(బి) హాస్టల్ను అధికారులు మూసివేశారు. అలాగే కొత్తగూడ ఆశ్రమ ఎస్సీ హాస్టల్, ఇనుగుర్తి ఎస్సీ హాస్టల్ను గత ఏడాది మూసివేశారు. పునఃప్రారంభించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థిసంఘాల నాయకులు, మేధావులు కోరుతున్నారు.
హాస్టళ్లను కాపాడాలి..
జిల్లా వ్యాప్తంగా గతంలో 23 హాస్టళ్లు ఉండేవి. ప్రస్తుతం 19 హాస్టళ్లలో 1,400 మంది విద్యార్థులు ఉన్నారు. జూనియర్ కాలేజీలకు సంబంధించి నాలుగు హాస్టళ్లు ఉండగా 300 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికే కొత్తగూడ, ఇనుగుర్తి మండలాల్లోని హాస్టళ్లు క్లోజ్ చేయగా.. మరో రెండు హాస్టళ్లు మూతపడే ప్రమాదం ఉంది. మంత్రి సీతక్కకు కొత్తగూడ హాస్టల్ను ప్రారంభించాలని అక్కడి విద్యార్థుల తల్లిదండ్రులు, దళిత నాయకులు వినతిపత్రం అందజేశారు. ఇనుగుర్తి మండలం ఏర్పడిన నేపథ్యంలో అక్కడి ఎస్సీ హాస్టల్ పునఃప్రారంభిస్తే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని నాయకులు కోరుతున్నారు. దీనిపై జిల్లా ఎస్సీ షెడ్యూల్డ్ కులాల అధికారి ఎం.నరసింహ స్వామిని వివరణ కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎస్సీ హాస్టళ్ల పునఃప్రారంభానికి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా జిల్లాలో మూతపడిన నాలుగు హాస్టళ్లను పునఃప్రారంభించేందుకు అధికారులు, నాయకులు చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు.
ఆ భవనం నిరుపయోగం
ప్రత్యేక తెలంగాణలో 2016లో మహబూబాబాద్ జిల్లా ఏర్పాటైన తర్వాత ఎస్సీ ఆనంద నిలయం హాస్టల్, బాలికల(బి) హాస్టల్ను మూసివేసి, ఆ భవనాన్ని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయానికి అప్పగించారు. కలెక్టరేట్ ప్రారంభం తర్వాత ఎస్సీ సంక్షేమ కార్యాలయం అక్కడికి మార్చారు. దీంతో ప్రస్తుతం ఆనంద నిలయం ఎస్సీ హాస్టల్ భవనం నిరుపయోగంగా ఉంది.
గతంలో నాలుగు ఎస్సీ హాస్టళ్లు మూత
మళ్లీ ప్రారంభిస్తే విద్యార్థులకు ఎంతో మేలు
అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి