
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● ఘన్పూర్ శివారులో ఘటన
స్టేషన్ఘన్పూర్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదం ఘన్పూర్ శివారు ఆర్ఆర్ దాబా సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని శివునిపల్లికి చెందిన యాల వెంకటేష్, సురేశ్(21) తండ్రి నాగరాజు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా వారు ప్రస్తుతం సికింద్రాబాద్లోని వారాసిగూడలో నివాసం ఉంటున్నారు. వెంకటేష్, సురేశ్ డ్రైవర్లుగా పనిచేస్తూ తల్లితో కలిసి ఉంటున్నారు. సురేశ్ బైక్పై శివునిపల్లికి వస్తున్నాడు. ఈ క్రమంలో బైక్ ఘన్పూర్ శివారులో అదుపుతప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న ఐరన్ సైడ్ బర్మ్కు ఢీకొనడంతో రోడ్డుపై ఎగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళ్తున్న బాటసారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు.
చౌళ్లపెల్లిలో వ్యక్తి..
ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చౌళ్లపెల్లి క్రాస్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం చౌళ్లపెల్లికి చెందిన రాచర్ల రవి(53) ఆదివారం రాత్రి పిల్లలను బస్ ఎక్కించడానికి బైక్పై ఆత్మకూరు వచ్చాడు. తిరిగి గ్రామానికి వెళ్తుండగా చౌళ్లపెల్లి క్రాస్ సమీపంలో గేదె ఎదురురావడంతో బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడింది. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం