
జీపీఓ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్
మహబూబాబాద్ అర్బన్: ఈ నెల 25న జిల్లా కేంద్రంలో నిర్వహించే గ్రామ పాలన అధికారి (జీపీఓ) పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మ చారీలతో కలిసి పరీక్ష నిర్వహణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీపీఓల నియామకంలో భాగంగా పూర్వ వీఆర్వో, వీఆర్ఏలకు ఆప్షన్ల కింద అవకాశం కల్పించి జిల్లాలో (152) మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎ.రవీందర్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మదార్, టౌన్ సిఐలు దేవేందర్, సర్వయ్య, ఏఓ పవన్ కుమార్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తికావాలి
మహబూబాబాద్ రూరల్/కురవి:ఽ ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని మాధవాపురం, కురవి, సీరోలు మండలాల్లోని కురవి, కొత్తూరు(సీ), అయ్యగారిపల్లి, నేరడ గ్రామాల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం, ఇంకా రావాల్సిన ధాన్యం, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్లోడ్ అయిన లారీలను అవసరం ఉన్న చోటకు వెంటనే పంపించాలన్నారు. హమాలీలను సిద్ధంగా ఉంచాలని, లారీ కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లు, సెంటర్ నిర్వాహకులు సంబంధిత క్లస్టర్ సిబ్బంది సమన్వయంతో ఉండాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు విజయ, పున్నం చందర్, చంద్రశేఖర్ ఉన్నారు.

జీపీఓ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి