
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ
● భవాని స్వీట్స్ తయారీ కంపెనీకి నోటీసులు
● రూ.3.90 లక్షల విలువైన గడువుతీరిన ముడి దినుసులు సీజ్
గీసుకొండ : గ్రేటర్ వరంగల్ గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలోని భవాని స్వీట్స్, కారా తయారీ కేంద్రంలో (బెల్ బ్రాండ్) రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో స్వీట్లు తయారు చేసే పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, హెయిర్ క్యాప్స్, హ్యాండ్ గ్లవ్స్ వాడకపోవడం, తుప్పు పట్టిన యంత్రాలను ఉపయోగించడం, గోడలు, పై కప్పు బూజుతో ఉండటం, కాలం చెల్లిన బిస్కెట్లు, శనగపప్పును గుర్తించిన బృందం అధికారి వి.జ్యోతిర్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తయారీ కేంద్రానికి నోటీసులు జారీ చేసి శాంపిల్స్ను హైదరాబాద్ ల్యాబ్కు పరీక్ష నిమిత్తం పంపిస్తున్నామని, కల్తీ అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. సుమారు రూ.3.90 లక్షల విలువైన గడువు తీరిన, లేబుళ్లు లేని పదార్థాలను సీజ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. టాస్క్ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు రోహిత్రెడ్డి, స్వాతి, శ్రీషి, సిబ్బంది పాల్గొన్నారు.
కాలంచెల్లిన కూల్డ్రింక్స్ సీజ్
ఖిలా వరంగల్: కల్తీ, కాలంచెల్లిన కూల్డ్రింక్స్ ఉత్పత్తులపై టాస్క్ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు చేసినట్లు ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ తెలిపారు. సీపీ సన్ప్రీత్సింగ్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ సూచనలతో మంగళవారం సాయంత్రం వరంగల్ శివనగర్లోని కేఎస్ కూల్డ్రింక్స్ డిస్ట్రిబ్యూషన్ షాపుపై దాడులు చేసినట్లు పేర్కొన్నారు. కల్తీ, కాలం చెల్లిన రూ.33,568 విలువైన కూల్డ్రింక్స్ను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడు ఎండీ ఖలీల్పై కేసు నమోదు చేసినట్లు వివరించారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తికి అప్పగించినట్లు చెప్పారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ ఎస్సై వడ్డె దిలీప్, సిబ్బంది పాల్గొన్నారు.
మొబైల్ వాడొద్దన్నందుకు..
● ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య
ఖిలా వరంగల్ : మొబైల్ వాడొద్దని మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాత్రి పెరుకవాడలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ పెరుకవాడకు చెందిన టింగిల్కార్ నితీషా (18) ఇంటర్ పూర్తి చేసింది. తరుచుగా సెల్ఫోన్ చూస్తుండడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన నితీషా సోమవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతురాలి సోదరుడు వికాస్ ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ