
యథేచ్ఛగా ఇసుక దందా
మంగపేట: మండలంలో అక్రమ ఇసుకదందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మంగపేట– వాడగూడెం సమీపంలోని గోదావరి నదిలో సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఇసుక దందాను పలువురు కొనసాగిస్తున్నారు. వందలాది లారీల్లో నిత్యం ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయలను జేబులో నింపుకుంటున్నారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ, మైనింగ్, టీజీఎండీసీ అధికారుల అండతో పంట పొలాల్లోని ఇసుక మేటల తొలగింపు పేరుతో ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అనుమతులు పొందారు. మంగపేట మార్కెట్ యార్డు, వాడగూడెం సమీపంలో 50నుంచి 60 మీటర్ల లోతులో ఉన్న గోదావరి నదిలో భారీ పొక్లెయిన్లతో ఇసుక తవ్వకాలు జరుపుతూ వందలాది లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఏజెన్సీలోని విలువైన సహజ సంపదను స్థానిక గిరిజనేతరుల సహకారంతో ఆంధ్రా ప్రాంతానికి చెందిన గిరిజనేతరులు దోచుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని గిరిజన సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గోదావరిలోకి రోడ్లు వేసి లారీల్లో ఇసుక తరలిస్తున్న వారిని ప్రశ్నిస్తే ప్రభుత్వమే తమకు కొండంత అండగా ఉంది.. అధికార యంత్రాగం సహకరిస్తుంది.. మీరు ఏం చేస్తారో చేసుకోండని చెప్పడం గమనార్హం. గోదావరి సాక్షిగా అక్రమ ఇసుక దందా కళ్లెదుటే సాగుతున్నా ఇటు రెవెన్యూ, అటు ఇరిగేషన్, మైనింగ్, టీజీఎండీసీ అధికారులు తమకేమీ సంబంధం లేదనే విధంగా వ్యవహరిస్తున్నారు.
లోడింగ్ చార్జీ పేరుతో వసూళ్లు
ఇసుక దందాను కొనసాగిస్తున్న ఇసుక మాఫియా గురించి అడిగే వారు లేకపోవడంతో క్వారీలకు వచ్చే లారీ యజమానులు, డ్రైవర్ల నుంచి లోడింగ్ చార్జీ పేరుతో ఒక్కో లారీకి రూ. 1,600 వసూలు చేస్తున్నట్లు యజమానులు, డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. క్వారీల్లో అక్రమ ఇసుక దందాను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని ఎత్తేశారా లేక నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఆ సార్ ఫోన్ ఎత్తరు
మండలంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న అక్రమ ఇసుక దందాపై స్థానిక తహసీల్దార్ను వివరణ అడిగతే ఇసుక తవ్వకాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని టీజీఎండీసీ పీఓ, మైనింగ్ అధికారులను అడగండి అంటు దాట వేస్తున్నారు. ఏటూరునాగారం టీజీఎండీసీ పీఓ తోట శ్రీధర్ను సంప్రదించేందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయడం లేదు.
పట్టించుకోని అధికారులు
ప్రభుత్వ ఆదాయానికి గండి