
స్థిరమైన వ్యవసాయానికి ‘దేశీ’ దోహదం
మహబూబాబాద్ రూరల్: స్థిరమైన వ్యవసాయానికి డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్ఫుట్ డీలర్స్ (దేశీ) కార్యక్రమం దోహదపడుతుందని డీఏఓ విజయనిర్మల, మల్యాలకేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాలతి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన దేశీ శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. దేశీ కార్యక్రమం సాంకేతిక జ్ఞానం, నైపుణ్యాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఎరువుల వినియోగం, పురుగుమందు ల ఉపయోగం, పర్యావరణ సంరక్షణ తదితర అంశాలపై డీలర్లు శిక్షణ పొందారన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న డీలర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. రిటైర్డ్ ఏడీఏ రామచందర్, డీఏఓ కార్యాలయ ఏడీఏ మురళి, శాస్త్రవేత్తలు కిశోర్ కుమార్, రాంబాబు, క్రాంతికుమార్ ఉన్నారు.
రిసోర్స్పర్సన్ల ఎంపిక
మహబూబాబాద్ అర్బన్: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ ఆదేశాల ప్రకారం ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయిలో అన్ని సబ్జెక్ట్లకు 191మంది రిసోర్స్పర్స న్లను ఎంపిక చేశామని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో ని అనంతారం మోడల్ స్కూల్లో మంగళవారం ఇంటర్వ్యూలు, డెమోలు నిర్వహించారు. డీఈఓ హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి విద్యను బలోపేతం చేయడానికి రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేశామన్నారు. ఎంపికై న ఉపాధ్యాయుల వివరాలను బుధవారం ప్రకటిస్తామన్నారు.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ
సభ్యుడిగా మధు
మహబూబాబాద్ అర్బన్: ఖమ్మంలో జరిగిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఐదో మహాసభలో జిల్లాలోని చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామానికి చెందిన పట్ల మధును రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా పట్ల మధు మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేపడుతున్నందుకు రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారన్నారు. ఈమేరకు రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
గుండెపోటుతో
ఏఎస్సై హఠాన్మరణం
మరిపెడ/గార్ల: మరిపెడ మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై హనుమంతు నాయక్ (58) గుండెపోటుతో మంగళవారం హఠాన్మరణం చెందారు. పిల్లల చదువుల కోసం ఖమ్మం పట్టణంలోని బల్లెపల్లిలో నివాసం ఉంటున్న ఆయన రోజు మాదిరిగానే మరిపెడలో విధులకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. కాగా, ఆయన మరణంతో స్వగ్రామమైన గార్ల మండలం మూడుతండాలో విషాదం అలుముకుంది. హనుమంతునాయక్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

స్థిరమైన వ్యవసాయానికి ‘దేశీ’ దోహదం