
మహాజాతరకు ముందస్తు ప్రణాళిక
ములుగు రూరల్: మేడారం మహాజాతర–2026 లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ శబరీశ్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ర్లు మహేందర్జీ, సంపత్రావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడారం మహాజాతరలో విధులు నిర్వర్తించిన అధికారులు ప్రస్తుతం జిల్లా అధికారులుగా కొనసాగుతున్నారని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో ఏర్పాట్లు చేయాలన్నారు. జాతర పరిసరాల్లో ఇప్పటికే రూ. 33 కోట్లతో రోడ్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. జాతరలో నాణ్యతాప్రమాణాలతో శాశ్వత నిర్మాణ పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. జాతరలో మరుగుదొడ్ల నిర్మాణం, మంచినీటి సరఫరా, గద్దెల ప్రాంగణం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. జాతరలో పోలీస్ యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతాఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులు సులభంగా దర్శనం చేసుకునేలా క్యూలైన్లు, పైకప్పులు ఏర్పాటు చేయాలన్నారు.
భారీ వర్షాల సమయంలో
అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామాల్లోని కాల్వల్లో గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలు తొలగించాలన్నారు. ములుగు జిల్లా కేంద్రం నుంచి ఏటూరునాగారం వరకు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న వృక్షాలను అటవీశాఖ, ఆర్అండ్బీ శాఖ అధికారులు పరిశీలించి బలహీనంగా చెట్లను తొలగించాలన్నారు. లోతట్టు గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. వరదల సమయంలో రక్షణ చర్యలకు అధికారులు సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో వర్షాకాలంలో రవాణా సౌకర్యాలు లేని గ్రామాలకు మూడు నెలల సరుకులు అందుబాటులో ఉంచాలన్నారు. వాగుల సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలకు అప్రమత్తతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సీజన్ వ్యాధులపై వైద్యాధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలకు అవసరమైయ్యే మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వర్షాకాలంలో దోమలు వృద్ధి చెందకుండా బ్లీచింగ్ పౌడర్, దోమల నివారణ మందు పిచికారీ చేయాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం సమిష్టి కృషితో మేడారం మహాజాతరను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ బానోత్ రవిచందర్, డీఎస్పీ రవీందర్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా, మండల అధికారులు, మేడారం పూజారులు తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షాలకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి
సీజనల్ వ్యాధ్యులపై అవగాహన సదస్సులు నిర్వహించాలి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క