బయ్యారం : వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మంగళవారం మండలంలోని కస్తూరినగర్లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కస్తూరినగర్ గ్రామానికి చెందిన కేలోత్ రంగ్య (52) ఎండ తీవ్రతకు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
ఐనవోలులో వృద్ధురాలు..
ఐనవోలు : మండలంలోని నందనం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు వడదెబ్బతో మృతిచెందింది. నందనం గ్రామానికి చెందిన యాకర సాలమ్మ (75) కూలీ పనులు, కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం కూరగాయలు అమ్ముకోవడానికి ఇంట్లో నుంచి వెళ్లింది. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై మధ్యాహ్నం ఇంటికి చేరుకుని స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత చుట్టు పక్కల వాళ్లు గమనించగా అప్పటికే ఆమె మృతి చెందింది. వడదెబ్బతో మృతిచెందిందని ప్రభుత్వం ఆదుకోవాలని మృతురాలి బంధువులు కోరారు.
డీఏఓ విజయనిర్మలకు ఆత్మ పీడీగా పదోన్నతి
మహబూబాబాద్ రూరల్: మానుకోట జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయనిర్మల వరంగల్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ప్రాజెక్టు డైరెక్టర్గా పదోన్నతి పొందారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు మానుకోట జిల్లా వ్యవసాయ అధికారిగా కొనసాగనున్నారు.
శ్రీభద్రకాళి అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు షురూ..
హన్మకొండ కల్చరల్ : నగరంలోని శ్రీభద్రకాళి అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాల అంకురార్పణ పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవారం అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వే దపండితులు గణపతిపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యప్రాశన, రుత్విగ్వరణ, వాస్తుయాగం, గణపతిహోమం, సుదర్శనహోమం, శ్రీభద్రకా ళీ పరివస్యా, చండీహోమం, నీరాజన మంత్రపుష్పం జరిపారు. అనంతరం కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి హాజరై అమ్మవారి సన్నిధిలో జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. సాయంత్రం అంకురార్పణ పూజలు నిర్వహించి సర్వతోభద్ర, నవగ్రహ, వాస్తు, యోగినీ, క్షేత్రపాలమండల లేఖనం, ధ్వజాధివాసం చేశారు. ఉదయం శ్రీగణపతి సేవ, సాయంత్రం శ్రీసుబ్రహ్మణ్యసేవ నిర్వహించారు. అంకురార్పణ పూజలకు ఉమ్మడి జిల్లా మున్నూరుకాపు సంఘం ఉభయదాతలుగా వ్యవహరించారు.