
ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి
● బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన
రాయపర్తి: ఆర్ఎంపీ వేసిన ఇంజక్షన్ వికటించి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బాధిత బంధువుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలకేంద్రానికి చెందిన ఓర్సు మల్లేష్(35) తన భార్యతోపాటు మరికొంత మందితో కొండూరు గ్రామంలో మట్టి తవ్వకానికి వచ్చారు. ఈ క్రమంలో మృతుడు ఒంట్లో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఈ క్రమంలో గ్రామంలోని పరమేశ్వర క్లినిక్ నిర్వహిస్తున్న ఆర్ఎంపీ వద్దకు వచ్చారు. ఆయన మల్లేష్కు ఇంజక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత కొంతసేపటికి మల్లేష్ మృతిచెందాడు. దీంతో ఆగ్రహానికి గురైన మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పరమేశ్వర క్లినిక్లో వేసి ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. ఆర్ఎంపీ పరారీలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, వర్ధన్నపేట ఎస్సై రాజు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ట్రాక్టర్ బోల్తా.. 12 మంది కూలీలకు గాయాలు
కమలాపూర్: కూలీ పనులకు వెళ్లిన కూలీలను తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి శివారులో శనివారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వంగపల్లికి చెందిన 19 మంది కూలీలు మిర్చి పంట ఏరేందుకు వెళ్లి పనులు ముగించుకుని తిరిగి ట్రాక్టర్లో ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కమలాపూర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం 8 మందిని స్కానింగ్, మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి, ఒకరిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.