
హత్య కేసులో నిందితుడి అరెస్టు
పాలకుర్తి టౌన్: కొడకండ్ల మండలం రేగులతండాలో ఇటీవల జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో సీఐ మహేందర్రెడ్డి శని వారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రేగులతండాకు చెందిన గుగులోతు శ్రీను(48) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే తండాకు చెందిన గుగులోతు జయరాం 20 ఏళ్ల క్రితం బతుకు దెరువు కోసం వెళ్లి హనుమకొండలోని రెడ్డికాలనీలో వాచ్మెన్గా పని చేస్తున్నాడు. ఇటీవల ఆటో కొనుక్కొని హనుమకొండలో నడుపుతున్నాడు. కాగా.. రేగులతండాలో శ్రీను, జయరాం ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. జయరాం హనుమకొండలో ఉండడంతో తండాలోని ఆయన ఇంటి వెనుకాల ఉన్న ఖాళీ స్థలంలో శ్రీను పశువులను కట్టేస్తుండేవాడు. ఈవిషయంలో పలుమార్లు ఇరువురు తండాలో తగాదా పడ్డారు. తన స్థలంలో పశువులను కట్టేస్తున్న శ్రీనును ఎలాగైనా అంతమొదించాలని నిందితుడు అనుకున్నాడు. ప్రణాళిక ప్రకారం ఈనెల 20న తండాకు వచ్చిన జయరాం రాత్రి 10 గంటల సమయంలో శ్రీనుతో గొడవపడి వెంట తెచ్చుకున్న కత్తితో ఛాతిపై పలుమార్లు పొడిచాడు. శ్రీను తీవ్రగాయాలతో అరవడంతో కుటుంబ సభ్యులు రావడంతో నిందితుడు ఆటోలో పారిపోయాడు. శ్రీను రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు వెంకన్న ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ఆటో, హ్యతకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై హనుమకొండ, కొడకండ్ల పోలీస్సేష్టన్లో గతంలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు చేధించిన కొడకండ్ల ఎస్సై రాజు, పోలీసులు రవీందర్రెడ్డి, వెంకటేష్, ఇమ్రాన్, రఘుపతి, అశోక్, అరుణ్, శ్రీకాంత్, సల్మాన్లను జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ అభినందించారు.
వివరాలు వెల్లడించిన సీఐ మహేందర్రెడ్డి