
‘భూభారతి’తో భూహక్కులకు రక్షణ
డోర్నకల్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టంతో భూహక్కులకు పూర్తి రక్షణ లభిస్తుందని ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ అన్నారు. మండలంలోని గొల్లచర్ల గ్రామంలో గురువారం భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దశాబ్దాల కాలంగా భూసమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటన్న ప్రజలకు భూభారతి చట్టంతో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. భూభారతి చట్టాన్ని రూపొందించేందుకు మేధావులు, పలువురు రాష్ట్ర మంత్రులు చాలా రోజులు కసరత్తు చేశారని తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి చట్టంతో భూసమస్యలు పెరిగాయన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలోనూ గ్రామ పరిపాలనా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే సామర్థ్యం ఉన్న వారే నిర్మాణాలు ప్రారంభించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అధికార పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ పథకాల అమలును నిత్యం పర్యవేక్షించాలని, కార్యకర్తలు అవకతవకలకు పాల్పడి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దన్నారు. కలెక్టర్ అద్వైత్సింగ్కుమార్ మాట్లాడుతూ.. భూసమస్యల సత్వర పరిష్కారంతో పాటు భూమి హక్కులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తుందని తెలిపారు. చట్టంపై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, త్వరలో చట్టంపై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి, ఆర్డీఓ కృష్ణవేణి, డీఏఓ విజయనిర్మల, మండల ప్రత్యేక అధికారి నర్సింహమూర్తి, తహసీల్దార్ కె.కృష్ణవేణి, ఎంపీడీఓ శ్రీనివాసనాయక్, డీటీ వీరన్న తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్