కూలీకి వస్తూ కానరానిలోకాలకు..
టేకుమట్ల: కూలీకి వస్తూ ఓ మహిళ కానరానిలోకాలకు వెళ్లింది. హార్వెస్టర్ వెనక్కి వస్తుండగా దాని కింద పడి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బూర్నపల్లి శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన కొంత మంది కూలీలు వరి పంటలో బెరుకుల తీసేందుకు ఆటోలో బూర్నపల్లికి వస్తున్నారు. ఈ క్రమంలో ఆటో ముందు హార్వెస్టర్ వెళ్తుండగా.. ఎదురుగా ఆర్టీసీ బస్సు వస్తోంది. దీంతో హార్వెస్టర్ ఆపరేటర్ బస్సుకు దారి ఇచ్చేందుకు వెనక్కి తీస్తున్నాడు. ఈ క్రమంలో హార్వెస్టర్ వెనుక ఉన్న ఆటోను డ్రైవర్ కూడా వెనక్కి తీస్తుండగా అందులో ఉన్న ఇద్దరు మహిళలు భయంతో కిందికి దిగారు. అయితే హార్వెస్టర్ వారిపైకి ఎక్కింది. ఈ ఘటనలో దాసరి కనుకమ్మ(55) అక్కడికక్కడే మృతి చెందగా, మరో కూలీ వసంతకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వసంతను చికిత్స నిమిత్తం వరంగల్ తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై దాసరి సుదాకర్ ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరించారు. అనంతరం కనుకమ్మ మృతదేహాన్ని చిట్యాల ఆస్పత్రి మార్చురీకి తరలిచారు.
కన్నీరుమున్నీరైన కూలీలు..
క్షణం ముందు ప్రాణంతో అందరి మధ్య ప్రయాణించిన కనుకమ్మ రెప్పపాటు క్షణంలో విగతజీవిగా మారడంతోపాటు మరో మహిళ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా చలించిన తోటి కూలీలు కన్నీరుమున్నీరయ్యారు. సాయంత్రం కూలీకి రాకున్నా బతికేదేమో అని విలపించారు.
ప్రాణాలు తీస్తున్న సాయంత్రం కూలీ..
వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండడంతో వ్యవసాయ కూలీలు ఉదయం, సాయంత్రం రెండు పూటల పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల మండలంలోని రామకిష్టాపూర్(టి) గ్రామానికి చెందిన మహిళా కూలీలు సాయంత్రం వేళ పొలంలోని బెరుకులు తీసేందుకు వెళ్లగా లారీ అదుపు తప్పి మీదపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే మొట్లపల్లి నుంచి కూలీలు సాయంత్రం వేళ పొలంలోని బెరుకులు తీసేందుకు వస్తుండగా హార్వెస్టర్ మృత్యుశకటమై కనుకమ్మను కబలించింది.
హార్వెస్టర్ కింద పడి
మహిళా కూలీ మృతి
ఒకరికి తీవ్ర గాయాలు
బూర్నపల్లి శివారులో ఘటన
బావిలోడి వ్యక్తి..
నెక్కొండ: వ్యవసాయ బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని వెంకటాపురంలో జరిగింది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాళ్లబండి పెద్ద రాజయ్య (56) ఈనెల 13న సాయంత్రం తన పొలం వద్దకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో దారిలో గ్రామానికి చెందిన కొత్తపల్లి వీరారావు వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. కుటుంబీకులు రాజయ్య కోసం వెతకగా సోమవారం సాయంత్రం బావిలో శవమై తేలి కనిపించాడు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించామని ఎస్సై పేర్కొన్నారు. మృతుడి కుమారుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నామని ఎస్సై తెలిపారు.
కూలీకి వస్తూ కానరానిలోకాలకు..


