బోరుమన్న మేచరాజుపల్లి.. | - | Sakshi
Sakshi News home page

బోరుమన్న మేచరాజుపల్లి..

Mar 10 2025 10:31 AM | Updated on Mar 10 2025 10:26 AM

కళ్లెదుటే భర్త, ఇద్దరు పిల్లల అంత్యక్రియలు జరుగుతుంటే తల్లడిల్లిన తల్లి

నెల్లికుదురు: తన కళ్లెదుటే కుటుంబం మొత్తం నీటిలో పడి మృత్యుఒడికి చేరి అంత్యక్రియలకు వెళ్తుంటే ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. భర్త, ఇద్దరు పిల్లలు చనిపోవడంతో ఇక తనకు దిక్కెవరంటూ దిక్కులు పిక్కటిళ్లేలా రోదించింది. తన ముద్దుల చిన్న కొడుకు, మనమడు, మనుమరాలు ఇక లేరని తెలిసి.. వారి మృతదేహాలను శ్మశాన వాటికకు తీసుకెళ్తుంటే వృద్ధ దంపతులు బోరున విలపించారు. తాము ఇక ఎవరి కోసం బతకాలంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. శనివారం వరంగల్‌ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలోని ఎస్సారెస్పీ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో మృతి చెందిన సోమారపు ప్రవీణ్‌ కుమార్‌, తన పిల్లలు చైత్ర, ఆర్యవర్ధన్‌ అంత్యక్రియలు ఆదివారం వారి స్వగ్రామం మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లిలో అశ్రునయనాల మధ్య జరిగాయి. ‘నాకు తలకొరివి పెట్టాల్సిన కొడుకుకు నేనే తలకొరివి పెట్టాల్సిన దుస్థితిని తీసుకొచ్చావా దేవుడా’ అంటూ మృతుడి తండ్రి సారంగపాణి రోదనలు మిన్నంటాయి. అంతిమ యాత్రలో చివరగా ముగ్గురికి కన్నీటి వీడ్కోలు పలికేందుకు గ్రామం మొత్తం కదిలొచ్చింది. ప్రవీణ్‌కుమార్‌తో చదువుకున్న అతడి స్నేహితులు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కడసారి చూపుకోసం మేచరాజుపల్లికి తరలిచ్చారు. కేరళ నుంచి యుగేంధర్‌, హైదరాబాద్‌ నుంచి బెల్లు శ్రీను, నాళ్లం హరికిషన్‌ ప్రసాద్‌ తదితరులు వచ్చారు. అంతిమయాత్రలో ముగ్గురిని ఒకేసారి శ్మశాన వాటికకు తీసుకెళ్తుంటే గ్రామం మొత్తం బోరుమంది. తండ్రి, పిల్లల మృతదేహాలకు పలువురు నాయకులు పూలమాల ఝవేసి నివాళులర్పించారు.

కడసారి చూపుకోసం

కదిలొచ్చిన గ్రామస్తులు

ముగ్గురికి తలకొరివి పెట్టిన

మృతుడి తండ్రి సారంగపాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement