కర్నూలు(సెంట్రల్): విద్యార్థులు లక్ష్యం ముందుకు సాగినప్పుడే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోగలరని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యసించి మంచి మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. స్వయంగా కలెక్టర్ విద్యార్థులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటర్మీడియెట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు చదువును మధ్యలో ఆపకుండా ఉన్నత విద్యవైపు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలని, సమాచార సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలే కానీ దుర్వినియోగం చేయరాదన్నారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన షైనింగ్స్టార్స్ షేక్ అబ్దుల్ రహిమాన్, కల్పి ముఖేష్, సెట్టప్ప దీపిక, అలీహ సుల్తానా, బీరేపల్లి మౌళ్య, కూరపాటి హేమంతి, పింజరి దౌలసాబ్, షేఖ్ ఆఫ్రిన్, గుడిసే చంద్రనతో పాటు జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సురేష్బాబు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక, బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసూన, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సురేష్, ఇంటర్మీడియట్ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ శ్రీదేవి, ఏపీసీ లోకరాజు పాల్గొన్నారు.


