 
															ఆశలను ‘కూల్చేసి’!
ఇళ్లు నిర్మించుకోని వారిపై కూటమి కాఠిన్యం
ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇంటి నిర్మాణాలను చేపట్టలేని పేదల ఇళ్లను ప్రభుత్వం రద్దు చేసేందుకు పూనుకోవడం అనాలోచిత చర్య. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలకు ఒక్కో ఇంటికి రూ.4 లక్షలు అందించాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా, నేటి వరకు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఒక్క ఇళ్లు కూడా మంజూరు చేయకపోవడం దుర్మార్గం. – కే రామాంజనేయులు,
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో కేవలం ఓట్ల కోసం ప్రజలను మోసం చేసేందుకు పలు హామీలను ఇచ్చింది. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలాలను ఇచ్చి గృహాలు నిర్మించి ఇస్తామని నమ్మబలికింది. అయితే నేటికి ఒక్క గృహాన్ని కూడా మంజూరు చేయలేదు. హామీని అమలు చేయాలి.
– కే ప్రభాకర్రెడ్డి,
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేద వర్గాలకు సంబంధించిన ఇళ్లపై కాఠిన్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి, మంజూరైన ఇంటిని నిర్మించుకోలేని గృహాలను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు క్షేత్ర స్థాయిలోని అధికారులు ఆయా కాలనీలను సందర్శించి నిర్మాణాలు ప్రారంభించని గృహాలను లెక్కగట్టి, వీటిని రద్దు చేసేందుకు ప్రతిపాదనలను పంపారు. ఈ లెక్కన జిల్లాలోని నాలుగు అర్బన్ ప్రాంతాల్లో 13,403 గృహాలు రద్దు కానున్నాయి. గత వైఎస్సార్సీపీ పాలనలో ‘నవ రత్నాలు పేదలందరికి ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా నిరుపేద వర్గాల సొంతింటి కలను సాకారాం చేసేందుకు చేసిన ప్రయత్నాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోంది. ఎలాంటి సొంత స్థలం లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలను ఇచ్చి, ఉచితంగా ఇళ్లు నిర్మించుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం జిల్లాలో 291 వైఎస్సార్ జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి దాదాపు 52 వేల గృహాలను మంజూరు చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జగనన్న కాలనీల పేర్లను పీఎంఏవై ఎన్టీఆర్ కాలనీలుగా మార్చింది. అలాగే అప్పట్లో ఇళ్లు మంజూరైనా, వివిధ కారణాల వల్ల గృహ నిర్మాణాలు చేపట్టని పేదల ఇళ్లను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్థిక కష్టాల్లో ఉన్న పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో ఒక్క ఇంటినీ
మంజూరు చేయని ప్రభుత్వం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పూర్తవుతున్నా, నేటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క ఇళ్లు కూడా మంజూరు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత ఇళ్లు లేని వేలాది మంది పేదలు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఇళ్ల కోసం దరఖాస్తు చేస్తున్నా, నేటికీ ఎలాంటి పురోగతి కనిపించని పరిస్థితి. కేవలం అర్బన్ ప్రాంతాల్లో (కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడురు) అది కూడా సొంత స్థలాలు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో పీఎంఏవై –2 కింద 2,839 మందికి గృహాలు మంజూరైనట్లు సమాచారం. ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షలను అందించనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1.50 లక్షలు కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.లక్షగా ఉంది. అయితే ఈ నిర్మాణాలు కూడా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.
13,403 గృహాల రద్దుకు
ప్రతిపాదనలు
గ్రామాల్లో కొత్తగా ఒక్క ఇంటినీ
మంజూరు చేయని ప్రభుత్వం
అర్బన్లో సొంత స్థలాలున్న వారికి
మాత్రమే 2,839 గృహాలు మంజూరు
 
							ఆశలను ‘కూల్చేసి’!
 
							ఆశలను ‘కూల్చేసి’!

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
