
ఉద్యోగాల పేరుతో మోసం!
కర్నూలు: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలు వెంకటరమణ కాలనీకి చెందిన రాజశేఖర్ రెడ్డి రూ.3 లక్షలు తీసుకుని మోసం చేశాడని కర్నూలు ఇందిరా గాంధీ నగర్కు చెందిన మహేష్ బాబు ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మహేష్ బాబు ఫిర్యాదుపై ఎస్పీ స్పందించి ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు మోసపోవద్దని, పోటీ పరీక్షల ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయన్నారు. డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పే వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 102 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా కూడా పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని...
● ప్రభుత్వ పథకం విద్యాంజలి 2.0లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ఫ్యాకల్టీ, అటెండర్, వంట మనిషి, వాచ్మెన్, స్వీపర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వెల్దుర్తికి చెందిన ప్రశాంత్ బాబు ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష దాకా తీసుకుని మోసం చేశాడని కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన నాగమణి, నారాయణ, అక్బర్, రాజేష్, సుజాత, వెంకటేష్, మద్దిలేటి తదితర బాధితులు ఫిర్యాదు చేశారు.
● లక్ష్మీపురం రోడ్డులో ఉన్న తను ప్లాట్ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు శ్రీరామ కాలనీకి చెందిన అనితరాణి ఫిర్యాదు చేశారు.
● పశుసంవర్థక శాఖలో తన ఇద్దరు కుమారులు డాక్టర్గా, ఏఈలుగా పనిచేస్తున్నారని, తనకు క్షయ వ్యాధి రావడంతో ఇంటి నుంచి తరిమేసి అన్యాయం చేశారని, విచారణ జరిపి న్యాయం చేయాలని కోడుమూరు మండలం మెరుగుదొడ్డి గ్రామానికి చెందిన హనుమంతు కోరారు.
● కర్నూలు బాలాజీ నగర్లోని గ్రామీణ బ్యాంకు దగ్గర ఇంటి గేటు లోపల ఉన్న బైక్ను గుర్తు తెలియని వ్యక్తులు తస్కరించారని, దర్యాప్తు చేసి బైక్ను వెతికించి ఇవ్వాలని యజమాని అన్వర్ ఫిర్యాదు చేశారు.
ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు