
పల్లెల్లో పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవు
కర్నూలు(అర్బన్): వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తితే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ హెచ్చరించారు. పారిశుద్ధ్యం చాలా అధ్వానంగా ఉందని ఆస్పరి మండలం జోహరాపురం గ్రామం నుంచి ఐవీఆర్ఎస్కు ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో ఈనెల 24న గ్రామాన్ని సందర్శించి తగిన చర్యలు చేపట్టామన్నారు. బుధవారం ఆయన కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలో ఇంటింటి చెత్త సేకరణను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రోజు ఇళ్ల నుంచి చెత్తను సేకరించి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. తొలకరి వర్షాలు కురుస్తున్నందున గ్రామాల్లో డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. అలాగే తాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
హాస్టళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించండి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై సంబంధిత వసతి గృహ సంక్షేమాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణి కె.ప్రసూన కోరారు. బుధవారం స్థానిక బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో జిల్లాలోని హెచ్డబ్ల్యూఓలతో ఆమె సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్టళ్లు పునః ప్రారంభం కావడం, హెచ్డబ్ల్యూఓల బదిలీలు కూడా పూర్తయిన నేపథ్యంలో ఆయా హాస్టళ్లను అన్ని అంశాల్లో మెరుగుపర్చాలన్నారు. వసతి గృహ సంక్షేమాధికారుల కొరత నేపథ్యంలో దాదాపు ఒక్కో హెచ్డబ్ల్యూఓ అదనంగా మరో హాస్టల్కు ఇన్చార్జిగా ఉన్నారన్నాని, తమ పరిధిలోని రెండు హాస్టళ్లల్లో ఏ రోజు ఏ హాస్టల్లో ఉంటున్నారనే సమాచారాన్ని తప్పక సహాయ బీసీ సంక్షేమాధికారి నోటీసులో ఉంచాలన్నారు. సమావేశంలో సహాయ బీసీ సంక్షేమాధికారులు ఎం.శ్రీనివాసులు, ఆంజనేయులు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పీజీసెట్ ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: ఏపీ పీజీ సెట్–2025 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల 9 నుంచి 12వ తేదీ వరకు 10 సెషన్లలో 31 సబ్జెక్టులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కేంద్రంలోని రెండు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 1,770 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,490 మంది పరీక్ష హాజరయ్యారు. వీరిలో 1,294 మంది అర్హత సాధించారు. కర్నూలుకు చెందిన బి.అర్షిత ఎలక్ట్రానిక్స్ కోర్సులో ప్రథమ ర్యాంకును కై వసం చేసుకున్నారు.
ఆరు సంస్థలకు అనుమతి
కర్నూలు(సెంట్రల్): జువైనల్ జస్టిస్ చట్టం–2015 ప్రకారం అర్హత కలిగిన ఆరు బాలల సంరక్షణ సంస్థలకు నిర్వహణ అనుమతులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. బుధవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో జిల్లాస్థాయి సిఫార్సుల కమి టీ సమావేశంలో ఆరు బాలల సంరక్షణ సంస్థలకు అనుమతులు మంజూరు చేశారు. మొత్తం 9 సంస్థలు దరఖాస్తు చేసుకోగా నిబంధనల మేరకు లేని మూడు సంస్థల దరఖాస్తులను తిరస్కరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ హుస్సేన్పీరా పాల్గొన్నారు.

పల్లెల్లో పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవు